జరిగిన దాడి లోక్సభపై మాత్రమే కాదు..: రేవంత్ రియాక్షన్: కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: లోక్సభలో చోటు చేసుకున్న ఉదంతం.. దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కర్ణాటకలోని మైసూరుకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప సింహ పాస్ ద్వారా లోనికి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు.. గ్యాలరీ నుంచి లోక్సభలోకి ప్రవేశించారు. సభ కొనసాగుతున్న సమయంలో పొగబాంబులను విసిరారు.
అనంతరం పారిపోవడానికి ప్రయత్నించిన వారిని సభ్యులు పట్టుకున్నారు. చితగ్గొట్టి.. భద్రత సిబ్బందికి అప్పగించారు. 2003లో సరిగ్గా ఇదే డిసెంబర్ 13వ తేదీన లోక్సభపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. సరిగ్గా 20 సంవత్సరాల తరువాత అదే రోజున ఈ ఘటన సంభవించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ ఘటనలో మొత్తంగా ఆరుమంది ప్రమేయం ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు. హిసార్కు చెందిన నీలం కౌర్, మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే, సాగర్ శర్మ, మనోరంజన్ డీ, లలిత్, విక్రమ్.. ఈ ఘటనకు పాల్పడినట్లు తేలింది. నీలం కౌర్, అమోల్ షిండేను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్యాలరీ నుంచి లోక్సభలో దూకిన వారిని సాగర్ శర్మ, మనోరంజన్గా గుర్తించారు.
ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్సభపై జరిగిన దాడి ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది- పార్లమెంట్పై జరిగిన దాడి మాత్రమే కాదని, ప్రజాస్వామ్య విలువలపై చోటు చేసుకున్న దాడిగా ఆయన అభివర్ణించారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు తన ట్వీట్ ను ట్యాగ్ చేశారు. ఈ ఉదంతంపై ఉపేక్షించకుండా సమగ్ర విచారణకు ఆదేశాలను జారీ చేయాల్సిన అవసరం ఉందని, వారి నేపథ్యాన్ని ఆరా తీయాలని కోరారు.












Click it and Unblock the Notifications