కుల గణనను వ్యతిరేకించడం అంటే బీసీల హక్కులకు అడ్డుపడటమే: సీఎం రేవంత్ రెడ్డి.
కులసర్వే ద్వారా సామాజిక న్యాయానికి బలమైన పునాదులు వేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లుకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో బీసీ సంఘాల నేతలు, ప్రముఖులు ఆయనను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ అభినందనలు తనకు కాకుండా, రాహుల్ గాంధీ గారికే చెందాలని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కులగణన నిర్వహిస్తామని స్పష్టంగా చెప్పారని, ఆ మాటకు నిలబడి తెలంగాణలో కులసర్వే చేపట్టామని వివరించారు.
కులసర్వే ఎందుకంటే?
రాష్ట్రంలో 50 శాతానికి పైగా రిజర్వేషన్లు పెంచాలంటే ముందుగా బీసీ జనాభా గణాంకాలు ఖచ్చితంగా తేలాలి. వాటిని చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా కులసర్వే నిర్వహించింది. మొదటి విడతలో పాల్గొనని వారికి రెండో విడతలో అవకాశం కల్పించడం ద్వారా సమగ్ర గణాంకాలు అందించేందుకు ప్రయత్నించామని సీఎం పేర్కొన్నారు.

సామాజిక న్యాయానికి బలమైన అడుగు..
ఫిబ్రవరి 4న జరిగిన అసెంబ్లీ సమావేశానికి ప్రత్యేకత ఉంది. అందుకే ఈ రోజును సోషల్ జస్టిస్ డేగా ప్రకటించామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కులసర్వే పూర్తయ్యాక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, టైమ్ ఫ్రేమ్ లో డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదిక సిద్ధం చేశామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కుల గణన చేపట్టాలన్నా, తెలంగాణ ఆదర్శంగా నిలవాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ అండ..
మండల్ కమిషన్ నివేదిక ప్రకారం దేశంలో బీసీల శాతం 52%గా ఉన్నప్పటికీ, తెలంగాణ కులసర్వే ద్వారా ఈ సంఖ్య 56.36%గా నిర్ధారించబడింది. కుల గణన ప్రక్రియ పూర్తయినందున, భవిష్యత్లో రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని సీఎం చెప్పారు. ప్రజలకు నిజమైన న్యాయం కల్పించేందుకు ఈ కులసర్వే బిల్లు అసెంబ్లీలో ఆమోదించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ బీసీలకు అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా పనిచేసినవారిలో ఎక్కువ మంది బీసీలే ఉన్నారని గుర్తుచేశారు. కుల గణన ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిదని పేర్కొంటూ, దీని ద్వారా భవిష్యత్తులో అవసరమైన మార్పులను చేర్చుకునే అవకాశం ఉంటుందని అన్నారు.
రాజకీయ కుట్రలకు బలికాకండి..
కొంతమంది కులం ముసుగులో రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ వర్గాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిని విశ్వసించొద్దని సీఎం హెచ్చరించారు. కులసర్వేను వ్యతిరేకించడం అంటే భవిష్యత్లో బీసీల హక్కులకు అడ్డుపడటమేనని, ఇది వారి స్వంత నష్టానికి దారితీస్తుందని చెప్పారు. హక్కుల సాధన కోసం బీసీలు స్వయంగా ముందుకు రావాలని, ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కుల గణన తెలంగాణలో సామాజిక న్యాయానికి కొత్త దిశను చూపిస్తుందని, బీసీల హక్కులకు బలమైన అస్త్రంగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications