రేవంత్ రెడ్డి వరాల జల్లు: హైదరాబాద్ లో కొత్త మార్పులు
హైదరాబాద్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. మంచినీటి సరఫరా నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయడానికి, వేగంగా విస్తరిస్తున్న శివారు ప్రాంతాల అవసరాలను తీర్చడానికి 8,858 కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి నీటి తరలింపు పథకాలను ప్రారంభించనున్నారు. ఫేస్-2, ఫేస్- 3 ఇందులో ఉన్నాయి. హైదరాబాద్ కోర్ సిటీతో పాటు శివారు ప్రాంతాలకూ మంచినీటి తరలింపు మరింత సులభతరమౌతుంది.
గోదావరి మంచినీటి పథకం రెండు, మూడుదశల కోసం 7,360 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు కింద మల్లన్నసాగర్ జలాశయం నుండి 20 టీఎంసీల నీటిని తీసుకుంటారు. ఇందులో 2.5 టీఎంసీలను మూసీ నది పునరుజ్జీవనం కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు మళ్లిస్తారు. మిగిలిన 17.5 టీఎంసీలు హైదరాబాద్ మంచినీటి అవసరాలకు ఉపయోగపడతాయి. ఈ క్రమంలో ఏడు మధ్యస్థ సరస్సులను కూడా గోదావరి జిలాలతో నింపుతారు.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టిన ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో- ఔటర్ రింగ్ రోడ్ మంచినీటి సరఫరా ప్రాజెక్టు మూడోదశనూ రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. దీనికి 1,200 కోట్లు రూపాయలు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు జీహెచ్ఎంసీ పరిధి, దాని చుట్టుపక్కల గల మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లు, ఔటర్ రింగ్ రోడ్ వెంబడి ఉన్న గ్రామ పంచాయతీలకు విస్తరించి ఉంది.
నిర్మించిన 71 రిజర్వాయర్లలో 15 ఇప్పుడు ప్రారంభించనున్నారు. ఇవి సరూర్నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, రాజేంద్రనగర్, షామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రామచంద్రాపురం, పఠాన్చెరు, బొల్లారం సహా 14 మండలాల్లోని 25 లక్షల మందికి మంచినీటి అవసరాలను తీరుస్తాయి.
కోకాపేట లేఅవుట్ అభివృద్ధి ప్రాజెక్టుకు కూడా రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇది కోకాపేట లేఅవుట్, నియో పోలిస్, ఎస్ఈజెడ్లకు మంచినీరు, మురుగునీటి పారుదల నెట్ వర్క్ ను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది. దీని నిర్మాణ వ్యయం 298 కోట్ల రూపాయలు. ఇది వచ్చే రెండేళ్లలో పూర్తవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు 13 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది.












Click it and Unblock the Notifications