శంకుస్థాపన చేయనున్న రేవంత్ రెడ్డి- సంప్రదాయాలు ఉట్టి పడేలా
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండగగా గుర్తింపు పొందిన సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు సన్నాహాలు మొదలయ్యాయి. దీన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే దీనికి అవసరమైన నిధులు కూడా విడుదల అయ్యాయి. మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేస్తోంది. వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించుకుంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 13, 14 తేదీల్లో మేడారంలో పర్యటించనున్నారు. సమ్మక్క, సారలమ్మ గద్దెల ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసంది. మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ కుమార్ సహా దేవాదాయ, అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆయనతో పాటు ఈ పర్యటనలో పాల్గొననున్నారు.

రెండు రోజుల కిందటే మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులపై రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయా పనులన్నీ కూడా వంద రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. మేడారం మహా గిరిజన జాతర ప్రారంభం అయ్యే నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు.
ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగకు సంబంధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో ఉండాలని, చారిత్రాత్మకంగా, సంప్రదాయాలు ఉట్టి పడేలా వాటిని నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని అన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో పాటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications