Telangana: సాయంత్రంలోగా ఛైర్మన్ ను నియమిస్తాం.. అసెంబ్లీలో సీఎం రేవంత్..
అసెంబ్లీలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగింది. ఇష్టానుసారం అప్పులు చేసి బీఆర్ఎస్ విద్యుత్ సంస్థను నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పవర్ ప్లాంట్ నిర్మాణం పేరుతో ప్రజల సొమ్మును ఆగం చేసినట్లు ఆరోపించారు. దీనిపై గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇచ్చింది బీఆర్ఎస్ అని చెప్పారు. దాదాపు రూ.90 వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేసినట్లు వివరించారు.
అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ నేతలని గుర్తు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరుగకపోతే విచారణ కమిషన్ ఎదుట ఎందుకు విచారణకు హాజరు కాలేదని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్కు కొత్త ఛైర్మన్ను నియమిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్ చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగిందన్నారు.

యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ ఆదాయం పెరిగిందన్నారు. విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేలా చేసింది కాంగ్రెస్సే అని వివరించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్పై న్యాయ విచారణ జరుగుతోందన్నారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడు అనేలా జగదీశ్ రెడ్డి మాట్లాడుతున్నాడని.. నిజంగా సత్యహరిశ్చంద్రుడు అయితే విచారణకు ఎందుకు హాజరు కాలేదన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ వినియోగం ప్రాతిపదికనే విద్యుత్ విభజన జరిగేలా జైపాల్రెడ్డి చూశారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణను ముమ్మాటికి చీకట్ల నుంచి కాపాడిన మహానుభావుడు జైపాల్రెడ్డి అని కొనియాడారు. ఆయన వల్లే తెలంగాణకు 54 శాతం విద్యుత్ వచ్చేలా విభజన జరిగినట్లు వివరించారు.












Click it and Unblock the Notifications