హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్.. 250 ఎకరాల్లో భారీ క్యాంపస్
హైదరాబాద్ లో దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఈ మేరకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు కోసం హైపర్ వాల్ట్, భాగస్వామ్య సంస్థలు దాదాపు రూ. 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా సుమారు 7 వేల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ లో దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) సామర్థ్యంతో ఈ అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ను అభివృద్ధి చేయనున్నారు.
ప్రపంచంలోని అగ్రశ్రేణి ఏఐ కంపెనీలు, హైపర్ స్కేలర్లు, గ్లోబల్ ఎంటర్ ప్రైజెస్ కు అవసరమైన భారీ కంప్యూటింగ్ మౌలిక వసతులను ఈ క్యాంపస్ అందించనుంది. అధిక సామర్థ్యం ఉన్న కంప్యూటింగ్ వ్యవస్థలు, లిక్విడ్ కూలింగ్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని తీర్చిదిద్దనున్నారు. దేశంలోని అత్యంత అధునాతన, అతిపెద్ద ఏఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ లలో ఇది ఒకటిగా నిలవనుంది. ఈ మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించి టీసీఎస్ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శనివారం సచివాలయంలో సమావేశమైంది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకే కాకుండా దేశానికి ఇది చారిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఏఐ విప్లవంలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా ఎదుగుతోందని తెలిపారు. ఏఐ మోడల్స్, కంప్యూటింగ్ సామర్థ్యం భవిష్యత్తులో కీలక ప్రజా మౌలిక వసతులుగా మారనున్న తరుణంలో ఆ సామర్థ్యం తెలంగాణలోనే అందుబాటులో ఉండటం రాష్ట్రానికి గొప్ప ప్రయోజనమని తెలిపారు. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన టీసీఎస్ ప్రతినిధులను ఈ సందర్భంగా సీఎం అభినందించారు. ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంతో తన కల నెరవేరిందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆశించిన విధంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి బలమైన పునాది పడిందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్-2047 ప్రకారం 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు అని అభివర్ణించారు. ఇక ఈ భారీ పెట్టుబడి ద్వారా ఏఐ, డేటా సెంటర్ల రంగంతో పాటు విద్యుత్, కూలింగ్, నెట్వర్కింగ్, నిర్మాణం, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ వంటి అనుబంధ రంగాల్లో కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

పర్యావరణానికి అనుకూలంగా గ్రీన్ ఎనర్జీ, వాటర్-న్యూట్రల్ డిజైన్తో ఈ క్యాంపస్ ను అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలకు 2026 జనవరిలో దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ మధ్య జరిగిన సమావేశం నాంది పలికింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం, టీసీఎస్ ప్రతినిధులతో పలుమార్లు చర్చలు జరిపి కొద్ది నెలల్లోనే ప్రాజెక్టును కార్యరూపంలోకి తీసుకొచ్చాయి. దేశంలోని మరో ఐదు రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నప్పటికీ తెలంగాణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును సాధించింది. ఈ ప్రాజెక్టుతో హైదరాబాద్ను గ్లోబల్ ఏఐ, డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం మరింత చేరువైంది.












Click it and Unblock the Notifications