సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాయిన్ ఏటీఎమ్
హైదరాబాద్: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. రైల్వే స్టేషన్లో ఇకనుంచి చిల్లర కోసం అగచాట్లు పడాల్సిన అవసం లేదు. ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కాయిన్ ఏటీఎమ్ను ఏర్పాటు చేశారు. ఈ మిషన్ను ఎస్బీఐ బ్యాంకు ఏజీఎం మేరి సగాయ గురువారం ప్రారంభించారు.
కాయిన్ ఏటీఎమ్ను ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రయాణికుల చిల్లర నాణాల సమస్యలను పరిష్కరించేందుకు కాయిన్ ఏటీఎమ్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆర్బీఐ ఆదేశాల మేరకు చిల్లర నాణాల సరఫరా మిషన్ ఏటీఎంను ఏర్పాటు చేశామని చెప్పారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చిల్లర నాణాల సరఫరా చేస్తుందని ఆమె తెలిపారు. ఇందులో కేవలం రూ. 10 చిల్లర వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ మిషన్ ద్వారా 1, 2 రూపాయాల కాయిన్స్ వస్తాయని అన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
ఈ కాయిన్ ఏటీఎమ్ ప్రారంభ కార్యక్రమంలో ఎస్బీఐ సికింద్రాబాద్ చీఫ్ మేనేజర్లు ఎం. సన్యాసిరావు, జి. రామకృష్టరావు, అధికారులు శేఖర్రెడ్డి, నాగ రాజశర్మ, అశుతోష్ పాల్గొన్నారు.