Bhatti: విద్యార్థుల తల్లిదండ్రులకు రూ.5 లక్షల పరిహారం, ఉద్యోగం..
జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి కలకలం రేపుతోంది. రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు కడుపు నొప్పి అంటూ విద్యార్థులు విలవిల్లాడుతూ ఆస్పత్రికి తరలించే లోపే చనిపోతున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సందర్శించారు.
పాఠశాలలో మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. విద్యార్థులు చనిపోవడం కలిచివేసిందని అన్నారు. పిల్లల తల్లిదండ్రులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చనిపోయిన చిన్నారుల కుటుంబానికి రూ. ఐదు లక్షల చొప్పున పరిహారంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని తెలిపారు. గత కొన్నేళ్లుగా పాఠశాలల పట్ల చూపిన నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని విమర్శించారు.

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా రూ. 5000 కోట్లు పాఠశాలల అభివృద్ధి కోసం కేటాయించినట్లు ఈ సందర్భంగా భట్టి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రతి హాస్టల్లో పారామెడికల్ స్టాప్ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా విద్యార్థులకు డైట్ చార్జీలు కూడా పెంచుతామని చెప్పారు. పిల్లలకు పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు.
ఆహారంతో పాటు విద్యార్థులకు మౌలిక వసతులు, బెడ్ షీట్లు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులతో భట్టి, పొన్నం మాట్లాడారు. తమ పిల్లలు ఎలా చనిపోయారో చెప్పాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు.ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు చనిపోయారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు విద్యార్థుల మృతి .. నలుగురు విద్యార్థుల అస్వస్థతకు సంబంధించిన సమగ్ర వివరాలను గురుకుల పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ మహిపాల్ రెడ్డిన డిప్యూటీ సీఎం, మంత్రి అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications