147 మందికి కరోనా పాజిటివ్.. మరో 167 మంది అనుమానితులు గల్లంతు.. దేశవ్యాప్తంగా హాహాకారాలు
ఎండలు పెరిగేకొద్దీ కరోనా ప్రభావం తగ్గిపోతుందన్న నమ్మకానికి విరుద్ధంగా దేశవ్యాప్తంగా వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం విడుదల చేసిన తాజా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 147కు పెరిగింది. వీలో 122 మంది భారతీయులుకాగా, మిగతా 25 మంది విదేశీయులు. పాజిటివ్ గా నిర్ధారణ అయి, చికిత్స తర్వాత కోలుకుని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినవాళ్ల సంఖ్య 14గా ఉంది.రోగుల సంఖ్య గంటగంటకూ పెరుగుతున్నది.
వీళ్లుకాకుండా, మరో 1200 అతితీవ్ర అనుమానిత వ్యక్తుల్ని నిర్బంధంలో ఉంచినట్లు కేంద్రం తెలిపింది. కరోనా భయాల నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వ్యక్తుల్ని క్వారంటైన్ చేస్తుండటంతో అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 8వేలకు చేరువైంది. వైరస్ సోకినవారి సంఖ్య కూడా 2 లక్షలకు పెరిగింది. అదే సమయంలో వైరస్ బారి నుంచి కోలుకున్నవారి సంఖ్య దాదాపు 83వేలుగా ఉంది.
ఏపీలో ఒకటే..
కరోనా ధాటికి ఆర్థిక రాజధాని ముంబై కొలువైఉన్న మహారాష్ట్రలో పరిస్థితి గంటగంటకూ దిగజారుతున్నది. కేంద్రం విడుదల చేసిన తాజా వివరాల ప్రకారం 38 పాజిటివ్ కేసులతో మహారాష్ట్ర టాప్ లో ఉంది. కేరళలో 25 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కాగా, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో 15 కేసులు నమోదయ్యాయ. ఢిల్లీలో 9, లడాక్ 8, తెలంగాణ, జమ్మూకాశ్మీర్ లో మూడేసి కేసులు, హర్యానా, రాజస్థాన్ లో రెండేసి కేసులు, తమిళనాడు, ఏపీ, పంజాబ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఉత్తరఖండ్ లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయింది.
యూపీలో అందరూ పాస్..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెద్ద రాష్ట్రం యూపీలో యోగి సర్కార్ జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే అక్కడ 15 పాజిటివ్ కేసులు బయటపడటంతో.. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఏప్రిల్ 2 వరకు మూసేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తేదీలోపు విద్యా సంవత్సరం ముగుస్తుండటంతో.. ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వరకు అందర్నీపై తరగతులకు ప్రమోట్ చేయాలని సర్కారు ఆదేశించింది. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, బహిరంగ మార్కెట్ల మూసివేతపైనా కొద్ది గంటల్లో ఆదేశాలు వెలువడొచ్చని అధికారులు చెప్పారు.
జనంలో కలిసిపోయిన రోగులు?
పంజాబ్ లోని లూథియానా సిటీలో అధికారులకు గొప్ప చిక్కొచ్చిపడింది. కరోనా వ్యాప్తి ఉధృతమైన తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను సిద్ధం చేసిన అధికారులు.. వాళ్లందరినీ క్వారంటైన్ లో ఉంచేందుకు ప్రయత్నించారు. కానీ గత నెలలలో విదేశాల నుంచి వచ్చిన ఓ 167 మంది జాడలేకుండా పోవడం అందరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. పాస్ పోర్టు, ఫ్లైట్ టికెట్లు తదితర వివరాల్లో అన్నీ తప్పుడు అడ్రెస్ లు ఉన్నాయని, బృందాలుగా ఏర్పడి ఆ 167 మంది కోసం గాలిస్తున్నామని పంజాబ్ పోలీస్ అధికారులు చెప్పారు.
Recommended Video
ఇతర దేశాల లెక్కలివి..
కొవిడ్19(కరోనా వైరస్) బారినపడ్డవాళ్లు, వైరస్ ధాటికి చనిపోయినవాళ్ల సంఖ్య దేశాల వారిగా ఇలా ఉంది.. బుధవారం నాటికి ఇటలీలో 31,506 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 2,503 మంది చనిపోయారు. అమెరికాలో పాజిటివ్ కేసులు 6,420, మరణాలు 108, పోలండ్ 238 కేసులు, ఐదుగురి మృతి. టర్కీ 98 కేసుల్లో ఒకరు చనిపోయారు. అర్జెంటీనాలో 79 పాజిటివ్ కేసులకుగానూ ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్యతోపాటు మరణాల్లోనూ చైనానే ముందుంది.