ధాన్యం కొనాలంటూ కాంగ్రెస్ పోరు: భారీ నిరసన ర్యాలీ; టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలంటూ రేవంత్ రెడ్డి ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు నువ్వా నేనా అంటూ ఆందోళన బాట పట్టారు. ఒకరిని మించి ఒకరు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక పక్క టిఆర్ఎస్ పార్టీ ఇందిరా పార్క్ వేదికగా మహా ధర్నాను కొనసాగిస్తుంటే, మరోపక్క కర్షకుడా.. కదలిరా అంటూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి ఆందోళన బాట పట్టింది.
రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరుబాట
రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాలని నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ అటు బిజెపిని, ఇటు రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై రెండు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిపిసిసి ఆధ్వర్యంలో గురువారం పబ్లిక్ గార్డెన్ నుండి బషీర్ బాగ్ లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు కర్షకుడా కదిలిరా పేరుతో రైతులతో నిరసన ర్యాలీ చేపట్టారు.

పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ నిరసన ప్రదర్శన
వరి ధాన్యం కొనుగోలు కోసం పోరుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేస్తూ నిరసనలు నిర్వహిస్తోంది. నవంబర్ 18 గురువారం నాడు రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించాలి అన్న ప్రధాన డిమాండ్ తో పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ పార్టీ నిరసన ప్రదర్శన జోరుగా కొనసాగుతుంది. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,రైతులు భారీగా పాల్గొంటున్నారు. టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, టీపిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ర్యాలీ ... కేంద్ర రాష్ట్రాల తీరుపై మండిపడిన రేవంత్ రెడ్డి
వడ్ల కంకులను చేతులలో పట్టుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ కాంగ్రెస్ పార్టీ ర్యాలీ కొనసాగుతోంది. వ్యవసాయ శాఖ కమిషనరేట్ వరకు ప్రదర్శన నిర్వహించిన అనంతరం రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తెలంగాణ రైతులను ఆదుకోవాలి అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతి పత్రం సమర్పించనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కర్షకుడా కదిలిరా ప్రదర్శనలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వరి పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని పేర్కొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలు చేస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలుపై తప్పించునే తీరు
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాది కాదు అంటే మాది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన 13 మద్దతు ధర వరి కూడా ఉందని, మద్దతు ధర ప్రకటించడం అంటే కొనుగోలు చేయడం అని అర్థం అని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగం సాగుచేసిన లక్షల క్వింటాళ్ల వరిధాన్యం వర్షాలకు తడిసి పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలంగాణ సర్కారు తీరుపై మండిపడ్డారు. మిల్లర్లు దోపిడీకి తెరలేపారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

తెలంగాణా రైతులను మోసం చేస్తున్న టీఆర్ఎస్ , బీజేపీలు : రేవంత్ రెడ్డి
ఇప్పటివరకు 11 లక్షల క్వింటాళ్ల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి 4743 కొనుగోలు కేంద్రాలను పేరుకు మాత్రమే ఓపెన్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 2,100 కోట్ల రూపాయల బకాయి ఉండగా 116 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుల సమస్యల కోసం పోరాటం చేసి, రైతుల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications