పొంగులేటికి హైకమాండ్ ప్రాధాన్యత వెనుక..!!
తెలంగాణలో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. గెలుపే ప్రామాణికంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. తెలంగాణలో సామాజిక - ప్రాంతీయ సమీకరణాలకు పార్టీ హైకమాండ్ ప్రాధాన్యత ఇస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ వరుస తప్పులతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అనూహ్యంగా కొత్తగా పార్టీలో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి కి హైకమాండ్ ప్రాధాన్యత పెంచింది. కీలకమైన ప్రచార కమిటీ కో-చైర్మన్ బాధ్యతలు అప్పగించింది.
Recommended Video

హైకమాండ్ కొత్త లెక్కలు
తెలంగాణ కాంగ్రెస్ లో హైకమాండ్ లెక్కలు మారుతున్నాయి. తాజాగా చేసిన నియామకాల్లో పార్టీలో కొత్తగా చేరిన పొంగులేటికి ప్రచార కమిటీ కో-చైర్మన్ బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ లోటుపాట్లు తెలియటంతో పాటుగా ఆర్దికంగా కీలకమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి వ్యూహాత్మకంగా పెంచుతున్న ప్రాధాన్యతతో..రేవంత్ సమస్యలు సృష్టిస్తున్న వేళ చెక్ పెడుతున్నట్లు కనిపిస్తోంది.

ఎలాగైనా అధికారంలోకి రావాలనేది కాంగ్రెస్ హైకమాండ్ లక్ష్యం. దీని కోసం నేరుగా పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. వ్యూహాలను రచిస్తోంది. ఎంపిక చేసిన నేతలకు బాధ్యత ఇస్తోంది. పార్టీకి నష్టం చేసే వ్యాఖ్యలు..నేతల వ్యవహార శైలి పైన నిఘా పెట్టింది. అందులో భాగంగా సమర్ధత కలిగిన నేతలకు ప్రాధాన్యత పెంచుతోంది.
పొంగులేటికి కొత్త బాధ్యతలు
రానున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను టీపీసీసీ ప్రచార కమిటీని కాంగ్రెస్ నాయకత్వం ఆచి తూచి ఎంపిక చేసింది. ఈ కమిటీలో మాజీ ఎంపీ, ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చోటు దక్కింది. పార్టీ మారిన తర్వాత స్పీడ్ పెంచిన పొంగులేటి.. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు. రానున్న ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
రెడ్డి సామాజిక వర్గం తెలంగాణలో పలు జిల్లాల్లొ గెలుపు ఓటమలును నిర్దేశించే స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రేవంత్ కు పగ్గాలు అప్పగించినా పార్టీ సీనియర్లతో వ్యవహరించిన తీరు అవసరానికి మించిన దూకుడు...వివాదాస్పద తీరుతో పార్టీకి ఎన్నికల సమయంలో నష్టంగా మారుతోందని హైకమాండ్ గ్రహించింది. దీంతో, రెడ్డి సామాజిక వర్గంలో పట్టు ఉండటంతో పాటుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు పూర్తిగా తెలిసిన వ్యక్తిగా హైకమాండ్ పొంగులేటిని గుర్తించింది.
రేవంత్ సెల్ఫ్ గోల్ ..నీలి నీడలు
కేసీఆర్ పైన తిరుగుబాటు జెండా ఎగుర వేసిన పొంగులేటి బీఆర్ఎస్ వ్యతిరేకులను కూడగట్టటంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ లోని అందరి నేతలతో పొంగులేటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాల్లో పొంగులేటికి ఉన్న అనుభవం పార్టీకి కలిసి వస్తుందని పార్టీ భావిస్తోంది. ఢిల్లీ స్థాయిలో నూ పొంగులేటికి వ్యాపార - రాజకీయ పరంగా ఉన్న సత్సంబంధాలు కలిసి వస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి తీరుతామని పొంగులేటి ధీమాగా చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు అదే నమ్మకం కలిగించారు. అన్ని రకాలుగా బలమైన నేతగా పొంగులేటిని కాంగ్రెస్ నాయకత్వం గుర్తించింది. గతంలో టీపీసీసీ చీఫ్ ప్రతీ నిర్ణయంలోనూ కీలకంగా ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి టీ కాంగ్రెస్ లో కనిపించటం లేదు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ మూడ్ ఏంటనేది స్పష్టంగా ఉందనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.












Click it and Unblock the Notifications