తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త సారధి ఖరారు..!!
టీపీసీసీ నూతన అధ్యక్షుడి నియామకంకు రంగం సిద్దమైంది. కాంగ్రెస్ అధినాయకత్వం ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. పీసీసీ అధ్యక్షుడితో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైన హైకమాండ్ అధికారికంగా నిర్ణయం వెల్లడించనుంది. కార్పొరేషన్లు, సంస్థలకూ చైర్మన్ల పేర్లను అధిష్ఠానం ఆమోదించనున్నట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ గా ఇద్దరి పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ ఛాయిస్ గా ఆ ఇద్దరి పేర్లలో ఒకరిని ఖరారు చేయనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా
ఆగస్టు 15 తరువాత తెలంగాణ కాంగ్రెస్ కు నూతన సాధరిని పార్టీ ప్రకటించనుంది. ఏఐసీసీని విస్తరించే పనిలో ఉన్న అధిష్ఠానం.. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతేరాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నాయి. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పై సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ వచ్చిన తర్వాత సమావేశం జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15 తర్వాత సీఎం, భట్టి, ఉత్తమ్ను ఢిల్లీకి పిలిపించుకుని తుది సంప్రదింపులు జరుపుతారని, చివరి వారంలో కొత్త టీపీసీసీని ప్రకటిస్తారని పేర్కొంటున్నాయి.

కాంగ్రెస్ కసరత్తు
బీసీ లేదా లంబాడాల నుంచి అధ్యక్షుడిని ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీసీల్లో గౌడ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్, మధుయాష్కీగౌడ్ పేర్లను పరిశీలించిన అధిష్ఠానం.. యాష్కీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే లంబాడాల నుంచి ఎంపీ బలరాంనాయక్ పేరును ప్రధానంగా పరిశీలిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేయాలనుకుంటే ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ పేరునే ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు.
కొత్త సమీకరణలు
తెరపైకి కొత్త సమీకరణాలు వచ్చేందుకూ ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నలుగురు కార్యనిర్వాహక అధ్యక్షుల్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గం, రెండోది మైనారిటీలకు కేటాయించనున్నట్లు చెబుతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ చీఫ్ను ఎంపిక చేస్తే ఆ సామాజిక వర్గానికి కార్యనిర్వాహక అధ్యక్షుడి పోస్టు ఉండదంటున్నారు. మిగిలిన రెండు వర్గాల వారికి ఆ పదవి దక్కనున్నట్లు చెబుతున్నారు. ప్రచార కమిటీ చైర్మన్గా మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నామినేటెడ్ పదవులను భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications