నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై దాసోజు శ్రణ్ సంచలన వ్యాఖ్యలు...
ప్రచార జోష్ ఫుల్.. పోలింగ్ నిల్... ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల పరిస్థితి. ప్రచార పర్వం ఎంత వాడి వేడిగా సాగిందో... పోలింగ్ అందుకు విరుద్దంగా అత్యంత నిరాసక్తిగా సాగింది. దీంతో గ్రేటర్ పీఠం ఎవరిదన్న చర్చ కంటే... అసలు పోలింగ్ శాతం తగ్గడానికి కారణమేంటన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మెదళ్లను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు టీవీ చానెళ్లు దీనిపై చర్చా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టీవీ ఛానెల్ వీ6 ఈ అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించగా... అందులో పాల్గొన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దాసోజు శ్రవణ్ ఏమన్నారు...
'పరుషమైన పదజాలం వాడుతున్నందుకు ఏమీ అనుకోవద్దు... కానీ ఒక ఐఏఎస్ అధికారిగా ఉండి ఎన్నికల కమిషనర్ దుర్మార్గంగా వ్యవహరించారు... నడిరోడ్డు మీద ఉరితీసినా తప్పు లేదు... టీఆర్ఎస్కు కొమ్ము కాసి ఇంత పెద్ద ఎన్నికలను చిల్లర ప్రహసనంలా మార్చేశారు. ఆయన వినాలనే ఈ కామెంట్స్ చేస్తున్నా... ఒక ఐఏఎస్ అధికారి అధికార పార్టీకి బానిసలా వ్యవహరించడమేంటి...?' అని దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చాలాచోట్ల బోగస్ ఓట్లను చేర్చారని... అర్హులైన ఓట్లను తొలగించారని శ్రవణ్ ఆరోపించారు. ఓటర్ల జాబితా ప్రకటించిన రోజు కూడా టీఆర్ఎస్,ఎంఐఎం మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయన్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ఒంటెద్దు పోకడలను అవలంభించారని విమర్శించారు. దాని పర్యవసానమే చాలామంది ఉత్సాహవంతులైన యువ ఓటర్ల ఓట్లు గల్లంతయ్యాయని న్నారు.

దారుణంగా పడిపోయిన పోలింగ్...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 డివిజన్లకు మంగళవారం(డిసెంబర్ 1) పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అక్కడక్కడా ఘర్షణలు మినహా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ముగిసింది. అయితే పోలింగ్ సరళిని గమనిస్తే... ఉదయం 7గం. నుంచి సాయంత్రం 6గం. వరకూ ఏ దశలోనూ పోలింగ్ పుంజుకోలేదు. చాలాచోట్ల ఓటర్లు పోలింగ్ బూత్ల వైపు కదిలేందుక నిరాసక్తి కనబర్చారు. ఓటింగ్లో పాల్గొన్నవాళ్లలో బస్తీ జనమే ఎక్కువగా ఉన్నారని... మిగతా ప్రాంతాల ప్రజలు ఓటింగ్కి దూరంగా ఉన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద 2010లో నమోదైన 42శాతం ఓటింగ్ కంటే ఈసారి మరింత తక్కువ ఓటింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 74లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న మహా నగరంలో 40శాతం లోపు పోలింగ్ జరగడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

పోలింగ్ తగ్గడానికి కారణాలేంటి...?
ఓటర్లలో నిరాసక్తత,వర్క్ ఫ్రమ్ హోమ్,వరుస సెలవులు,కరోనా భయం,విద్వేషపూరిత వ్యాఖ్యలు,ముందస్తు ఎన్నికలు తదితర కారణాలు ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమై ఉంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ పార్టీల ఎజెండాలకు,ప్రజల ఎజెండాలకు బారీ గ్యాప్ ఉండటం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చునని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. అలాగే ఏదైనా ఒక పార్టీని గెలిపించాలన్న బలమైన కోరిక గానీ,ఒక పార్టీని ఓడించాలన్న బలమైన కోరిక గానీ లేకపోవడం కూడా ఇందుకు కారణమై ఉండవచ్చునని అన్నారు.












Click it and Unblock the Notifications