'తెలుగుదేశం పార్టీతో కలవలేదు కానీ, ఓటుకు నోటులో క్విడ్ ప్రో కో'
హైదరాబాద్: తాము తెలుగుదేశం పార్టీతో కలిసినట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు చెప్పడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపాయన్న ఆయన, ఈ కారణంతో తెలంగాణలో టిడిపితో కాంగ్రెస్ కలిసిందనడం సరికాదన్నారు.
ఓటుకు నోటు కేసులో క్విడ్ ప్రో జరిగిందని ఆరోపించారు. పట్టిసీమను, పోలవరాన్ని సమర్ధించింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గుర్తు చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెరాస వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆరోపించారు.
తెలంగాణకు సెప్టెంబర్ 17వ తేదీనే నిజమైన స్వాతంత్ర్యం వచ్చిన రోజని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతా రావు అన్నారు. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ చరిత్ర హీనుడిగా మిగులుతారన్నారు.
తెలంగాణ చరిత్రను మార్చే ప్రయత్నం కేసీఆర్ చేయవద్దన్నారు. నాడు కాంగ్రెస్ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కానీ ముస్లీంలకు వ్యతిరేకంగా కాదన్నారు. గతంలో తెలంగాణ కోసం పాటుపడిన జమలాపురం కేశవరావు, రావి నారాయణ రెడ్డి, రామానందతీర్థలను ప్రభుత్వం మరవవద్దన్నారు.