ఖబడ్దార్: డీకే అరుణ, ఆత్మహత్య ఎందుకు చేసుకున్నావ్: కేసీఆర్పై రేవంత్
హైదరాబాద్: అసెంబ్లీ రద్దు ప్రకటించిన తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై కాంగ్రెస్ పార్టీ నేతలు డీకే అరుణ, రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీలు గురువారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
Recommended Video
కేసీఆర్ మరో సంచలనం, 105 మంది అభ్యర్థుల ప్రకటన, వారికి మాత్రమే నో టిక్కెట్
అసెంబ్లీ రద్దుతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని బిగ్గెస్ట్ బఫూన్ అని కేసీఆర్ అంటున్నారని, కానీ ఆయనే పెద్ద బఫూన్ అన్నారు. కేసీఆర్ తెలంగాణ బఫూన్ అన్నారు.
100 సీట్లు వస్తాయని ముందస్తు ఎందుకు?
సర్వేలో 100 సీట్లు వస్తాయని తెలిసినప్పుడు ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తానేదో 9 నెలలు త్యాగం చేశానని కేసీఆర్ చెబుతున్నారని, ఎవరి కోసం త్యాగం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఖబడ్దార్.. కేసీఆర్, కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు.
కేసీఆర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావ్?
కేసీఆర్ మోసకారి, కేటీఆర్ అహంకారి అని తెలంగాణ ప్రజలకు అర్థమైందని రేవంత్ రెడ్డి అన్నారు. నిండుగా 5 సంవత్సరాలు పాలించాలని తెలంగాణ ప్రజలు తీర్పు ఇస్తే, కేసీఆర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడో చెప్పాలన్నారు. కేసీఆర్ ఆత్మహత్య చేసుకుంటే తమకు అభ్యంతరం లేదని, కానీ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. 2014లో ఇచ్చిన మూడెకరాల భూమి, కేజీ టు పీజీ విద్యుత్, ఇంటింటికి నీళ్లు.. ఇలా ఎన్నో హామీలు అమలు చేయలేదని హామీల చిట్టాను చదివారు. నూటికి నూరు శాతం మేనిఫెస్టోలో పెట్టిన హామీల విషయంలో కేసీఆర్ విఫలమయ్యారని చెప్పారు. రాసిపెట్టుకోండి కేసీఆర్ను వంద స్థానాల్లో ఓడిస్తామని రేవంత్ అన్నారు.
నీకు బతుకు ఇచ్చిందే కాంగ్రెస్
తెలంగాణకు కాంగ్రెస్ తొలి విలన్ అని కేసీఆర్ చెబుతున్నారని, కానీ నీకు బతుకును ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్నారు. 2004లో నీకు కాంగ్రెస్ వల్లే 26 సీట్లు వచ్చాయన్నారు. తెలంగాణ ఇచ్చాక సోనియా గాంధీని కలిసి, కాళ్లు పట్టుకొని, పార్టీని విలీనం చేస్తానని చెప్పారని, కానీ మోసం చేశారన్నారు. తాను వంద సీట్లు గెలుస్తానని కేసీఆర్ చెబుతున్నారని, కానీ వంద సీట్లు గెలుస్తోవో.. లేక బొంద సీట్లు గెలుస్తావో అని మండిపడ్డారు.
అందరూ దొంగలే
కేవలం మూడు నెలలు ముందు వచ్చే ఎన్నికల కోసం అభివృద్ధి కుంటుపడుతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ పార్టీతో ఇప్పుడు పొత్తు కోసం, 2019లో బీజేపీతో పొత్తు కోసం ముందస్తుకు వెళ్తున్నారని ఆరోపించారు. వారి ఎమ్మెల్యేలు అంతా దొంగలే అన్నారు. పుట్టా మధు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని, దళితులను తొక్కించి చంపించారని అన్నారు. కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీ విమర్శించారు. ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లు ఇస్తానని చెప్పాడని, అది ఏమయిందని ప్రశ్నించారు.