జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు: పాశవికం అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మే 6,7వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్గాంధీ ఓయూలో పర్యటిస్తారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. అయితే దీనికి ఓయూ వీసీ, ప్రభుత్వం అనుమతి లభించలేదు. ఈ క్రమంలో అనుమతివ్వాలంటూ.. ఆదివారం ఓయూ విద్యార్థులు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించారు.
అంతేగాక, మినిస్టర్స్ క్వార్టర్స్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అరెస్టైన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
జగ్గారెడ్డి అరెస్టుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం: ప్రభుత్వపై విమర్శలు
అరెస్టైన ఓయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు నిర్బంధించడం పాశవిక పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ పర్యటన కేసీఆర్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ కి వస్తామంటే అడ్డుకోవడం ఎందుకని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. నియంత రాజ్యంలో ఉన్నామా..;? అని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం అనుభవిస్తున్న భోగాలన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్, సోనియా గాంధీల భిక్ష అని, కేసీఆర్ ఒక పిరికి పాలకుడు అని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనకు మరో 12 నెలలు మాత్రమే గడువు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకున్నందుకు విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళను అరెస్ట్ చేయడం దారుణమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.