దిగ్విజయ్ ముందే గూడూరునారాయణరెడ్డిపై కోమటిరెడ్డి దాడి, కారణమిదే
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ ఎదుటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ దిగ్విజయ్ ఎదుటే కాంగ్రెస్ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగారు. గూడూరు నారాయణరెడ్డిపై ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. ఇరువురు ఒకరిపై మరోకరు పరస్పర దాడులకు పాల్పడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ జిల్లాలవారీగా సమీక్ష నిర్వహించారు. అయితే నల్గొండ జిల్లా సమీక్ష సమావేశంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు గూడూరు నారాయణరెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు భువనగిరి సీటు దక్కకుండా కోమటిరెడ్డి అడ్డుకొన్నారని గూడూరు నారాయణరెడ్డి ఆరోపించారు.అయితే ఈ విషయంలో కోమటిరెడ్డికి సంబంధం లేదని దిగ్విజయ్ సింగ్ చెప్పినా గూడూరు శాంతించలేదు.
ఇరువురు నాయకుల మధ్య తీవ్ర వాగ్వావాదం చోటుచేసుకొంది. పరస్పరం దూషించుకొన్నారు.భువనగిరి ఎంపిగా పనిచేశానని అక్కడి అసెంబ్లీ సెగ్మెంట్లలో తన పాత్ర ఉంటుందని రాజగోపాల్ రెడ్డి అనడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకొంది.
దీంతో గూడూరు నారాయణరెడ్డిపై కోమటిరెడ్డి దాడికి పాల్పడ్డారు.అయితే గూడురు కూడ ప్రతి దాడికి పాల్పడ్డాడు. అయితే ఇద్దరి నేతలను సమావేశంలో పాల్గొన్న నాయకులు సర్ధిచెప్పి శాంతింపజేశారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా సమావేశంలో కూడ మల్ రెడ్డి సోదరులపై పార్టీ నాయకుడు క్యామ మల్లేష్ తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి తనకు పార్టీ టిక్కెట్టును కేటాయిస్తే మల్ రెడ్డి రంగారెడ్డి సోదరుడు రాంరెడ్డి రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగి తన ఓటమికి పాలయ్యారని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయంలో పార్టీ నాయకులు తనకు న్యాయం చేయాలని కోరారు.