కాంగ్రెస్ పార్టీ సర్వే: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇలా ఉండొచ్చు!
హైదరాబాద్: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు తెలంగాణ శ్రేణుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది. దీంతో కొత్తగా ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకుంటూ జోరు చూపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో నిర్వహించింది. ఈ సర్వే వివరాలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సర్వేలో ఏ పార్టీకి కూడా మెజార్టీ సీట్లు రాకపోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి 37 శాతం, కాంగ్రెస్ పార్టీకి 34 శాతం, బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తాయని రేవంత్ తెలిపారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి 45 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 45, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరో 15 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని తెలిపారు. గతంలో 24 శాతం ఉన్న బీజేపీ ఓట్ల శాతం 14 శాతానికి పడిపోయిందన్నారు. ఎన్నికల నాటికి ఈ పరిస్థితులు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నట్లు తెలిపారు.

శుక్రవారం సాయంత్రం గాంధీభవన్లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్ణయాలను రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కన్వీనర్గా షబ్బీర్ అలీ బాధ్యత వహిస్తారని చెప్పారు. మండల కమిటీలకు సంబంధించి చాలా ప్రతిపాదనలు వచ్చాయని, పది రోజుల్లో అన్ని మండల కమిటీలు పూర్తి చేస్తామన్నారు.
బీసీ డిక్లరేషన్, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ డిక్లరేషన్పై చర్చ జరుగుతోందని రేవంత్ తెలిపారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జూన్ నెలాఖరుతో ముగుస్తుండటంతో ఖమ్మంలో జాతీయ నాయకులతో భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని రేవంత్ తెలిపారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురనాథ రెడ్డి బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరతారని రేవంత్ రెడ్డి చెప్పారు.
మరోవైపు, ఖమ్మంలో కీలక నేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నేతలు కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు కూడా జరిపారు.












Click it and Unblock the Notifications