విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు.. రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధరలు, విద్యుత్ చార్జీల తగ్గింపు డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపధ్యంలో తాజాగా విద్యుత్ సౌధ ముట్టడికి యత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
విద్యుత్ సౌధ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు... నేతల హౌస్ అరెస్ట్ లు
దేశంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుండి ర్యాలీ చేపట్టి, విద్యుత్ సౌధ ముట్టడించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పార్టీ నాయకులంతా ఇందిరా గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని అక్కడి నుండి విద్యుత్ సౌధ ముట్టడికి వెళ్ళవలసి ఉంది. అయితే ఆందోళనలకు అనుమతి లేదని పోలీసులు కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ లు నిర్వహించారు. నిన్న రాత్రి నుండి జిల్లాల వారీగా ముఖ్య నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగింది.
జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి నివాసం వద్ద భారీగా పోలీసులు
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, దాసోజు శ్రవణ్, మల్లు రవి వంటి ముఖ్యనేతలను హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆందోళన చెయ్యాలని భావించిన కాంగ్రెస్ నాయకులను హౌస్ అరెస్ట్ చెయ్యటంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం నేపధ్యంలో జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Recommended Video
కేంద్రం పెంచుతున్న ధరలకు నిరసనగా సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయ ముట్టడి
విద్యుత్ చార్జీలతో పాటు, పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై కూడా నిరసన తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కేంద్రం పెంచుతూ పోతున్న ధరలకు నిరసనగా సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించింది. పార్టీలో అనుబంధ సంఘాలు, కిసాన్ కాంగ్రెస్ నేతలు, సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయం ముట్టడిలో పాల్గొనాలని నిర్ణయించారు. విద్యుత్ ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఆందోళనను ఉధృతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
కేసీఆర్ క్యాంప్ కార్యాలయం కంటే రేవంత్ ఇంటి వద్దే భారీగా పోలీసులు
పెరిగిన ధరలు పేదల మీద భారం మోపకుండా ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. పెట్రోల్ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న టాక్స్ తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఆందోళనలు ఉధృతం చేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎంకు భయం పట్టుకుందని అందుకే కెసిఆర్ క్యాంప్ కార్యాలయం కంటే ఎక్కువగా తన ఇంటి వద్ద పోలీసులు మోహరించారని ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. కేసీఆర్ సర్కారు తీరుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు.