మహాకూటమికి ఊహించని షాక్, టీఆర్ఎస్కు లబ్ధి: 40చోట్ల దెబ్బ, తెరపైకి కొత్త కూటమి!
Recommended Video
హైదరాబాద్: మహాకూటమిలో భాగంగా టీడీపీ, తెలంగాణ జన సమితి పార్టీలకు పలు నియోజకవర్గాలు వెళ్లడం, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన స్థానాల్లో తమకు టిక్కెట్లు రాకపోవడంపై ఆశావహులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసంతృప్తుల జాబితా చాంతాడంత ఉంది. వీరంతా కలిసి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని మహాకూటమికి భారీ షాకిచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
టిక్కెట్కు 3 కోట్లు డిమాండ్, ఆడియో: కాంగ్రెస్ నేత సంచలనం, రాహుల్ ఇంటి వద్ద కార్తీక రెడ్డి ధర్నా
దాదాపు నలభై స్థానాల్లో కాంగ్రెస్ రెబెల్స్ లేదా మహాకూటమి రెబెల్స్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బే. దాదాపు నలభై అంతకు ఎక్కువ స్థానాల్లో కూటమి అసంతృప్తులు ఏకమై పోటీ చేస్తున్నారంటే.. వారు గెలవడం, ఓడిపోవడం విషయాన్ని పక్కన పెడితే కూటమి ఓట్లు భారీగా చీలి, దెబ్బపడుతుంది. అది తెరాసకు లాభిస్తుంది.
40 మంది వరకు బరిలోకి దిగుతాం
ఈ మేరకు టిక్కెట్ ఆశించిన ఆశావహులు బోడ జనార్ధన్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కుంతియా సాయంతో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. పలు స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ రెబల్స్ పేరుతో 40 మంది వరకు బరిలోకి దిగుతామని చెప్పారు. తామంతా కూటమిగా ఏర్పడుతామన్నారు. అసమ్మతి నేతలమంతా కూటమిగా ఏర్పడిన అనంతరం రెండు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
రెబల్స్ గెలిచినా, కాంగ్రెస్ వెంటే
పార్టీలో కొత్తగా చేరిన 19 మందికి సీట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ రెబల్స్ పలువురు ఆరోపిస్తున్నారు. క్యామ మల్లేష్ ఆరోపణలే ఇందుకు చిన్న ఉదాహరణ అన్నారు. టీడీపీ అసమ్మతి నేతలు కూడా ఈ రెబల్స్ కూటమితో టచ్లో ఉన్నారని చెబుతున్నారు. అందరు కలిసి రెబల్స్ కూటమిగా పోటీ చేయాలని దాదాపు నిర్ణయించారు. కాగా, కూటమి అభ్యర్థి ఓడి, తాము గెలిచినా తాము కాంగ్రెస్ వెంటే ఉంటామని పలువురు చెబుతున్నారు.
బోడ జనార్ధన్ నివాసంలో భేటీ
కాంగ్రెస్లో టిక్కెట్లు దక్కని నేతలు ఇప్పటికే గురువారం రాత్రి హైదరాబాద్ వేదికగా ఓసారి సమావేశమయ్యారు. మాజీ మంత్రి, చెన్నూరు కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన బోడ జనార్ధన్ నివాసంలో పదిహేు, ఇరవై మంది నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం మరికొందరు నేతలతో చర్చించారు.
పలువురి రాజీనామా, ఇతర పార్టీలలోకి
కాంగ్రెస్లో టిక్కెట్ల లొల్లి ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. టికెట్ దక్కలేదని ఇప్పటికే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అరుణతార (జుక్కల్), కొత్తగూడెంకు చెందిన ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. 19వ తేదీలోగా తనకు రాజేంద్రనగర్ టిక్కెట్ ఇవ్వకుంటే రాజీనామాను ఆమోదించినట్లుగానే భావిస్తానని తేల్చి చెప్పారు. ఇబ్రహీంపట్నం స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు క్యామా మల్లేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎడవల్లి కృష్ణ బిఎల్ఎఫ్లో చేరారు. కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన మాజీ మంత్రి శంకరరావు షాద్ నగర్ నుంచి రెబల్గా బరిలోకి దిగుతున్నారు. వరంగల్ వెస్ట్ స్థానాన్ని ఆశించిన నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండలో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. సూర్యేపట టిక్కెట్ ఇవ్వకపోవడంపై పటేల్ రమేష్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ముథోల్ టిక్కెట్ ఆశించిన నారాయణరావు పటేల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి తెరాసలో చేరారు.