జూబ్లీహిల్స్ లో గెలిచేది ఆ పార్టీనే..
Jubilee Hills bypoll: తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలకంగా మారింది. మూడు పార్టీలకూ అగ్నిపరీక్ష పెడుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ.. ఈ నియోజకవర్గంపై కన్నేశాయి. దీన్ని హస్తగతం చేసుకోవడానికి పోటీ పడుతున్నాయి. పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారంటే.. ఈ ఎన్నికను ఆ పార్టీ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు.
బీఆర్ఎస్ శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూత వల్ల ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైన విషయం తెలిసిందే. ఈ నెల 11వ తేదీన పోలింగ్ జరుగనుంది. 14వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే నామినేషన్ల పర్వం మొత్తం ముగిసింది. ఆయా పార్టీలన్నీ ప్రచారబరిలో దిగాయి. సిట్టింగ్ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య లోక్ పోల్ సంస్థ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించింది. ఓటర్ల మనోగతాన్ని అడిగి తెలుసుకుంది. 3,100 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది లోక్ పోల్. ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనపర్చుతోంది. ఈ నియోజకవర్గంలో 44 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. బీఆర్ఎస్- 38, బీజేపీ- 15 శాతం ఓటర్ల మద్దతు కనిపించింది. ఇతరులు మూడు శాతం మేర ప్రభావం చూపనున్నారు.
బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య ఆరు శాతం తేడా ఉండటం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే.. ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు. కాంగ్రెస్ కు ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించడం టర్నింగ్ పాయింట్ గా పేర్కొంది. నియోజకవర్గం పరిధిలో ఉన్న ఎంఐఎం మెజారిటీ మద్దతుదారులు, ఆ పార్టీ ఓటుబ్యాంక్.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని లోక్ పోల్ అంచనావేసింది. కాంగ్రెస్ కు ఆధిక్యత ఇచ్చిన ఆరు శాతం ఓటర్లల్లో ఎక్కువమంది ముస్లింలే ఉన్నారని పేర్కొంది.
బీఆర్ఎస్ లో ప్రారంభంలో ఉన్న దూకుడు ఇక్కడ కనిపించట్లేదని, క్రమంగా వెనుకపడుతోందని లోక్ పోల్ అభిప్రాయపడింది. మాగంటి సునీత గెలుపు కోసం కేటీఆర్ తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ..కిందిస్థాయి క్యాడర్ లో ఆ జోష్ కనిపించట్లేదు. మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రచారం సానుభూతి కోణం చుట్టూ తిరుగుతోండటం కూడా మైనస్ గా మారింది. హిందూ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ సాంప్రదాయ ఓటు బ్యాంకును కొంతమేర చీల్చే అవకాశం ఉందని లోక్ పోల్ తెలిపింది.
Our Projection for the #JubileeHills Assembly ByPoll – #Telangana
— Lok Poll (@LokPoll) October 31, 2025
▪️@INCIndia 44%
▪️@BRSParty 38%
▪️@BJP4India 15%
▪️Others 3%
Sample size: 3,100#AssemblyElections #Elections2025 pic.twitter.com/LpSsDq4Urf
మొత్తానికి జూబ్లీహిల్స్ బైపోల్ రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. హోరాహోరీ ప్రచారంతో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్లు దూసుకెళ్తున్నాయి. అయితే సర్వేలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేల్చాయి.












Click it and Unblock the Notifications