కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి ఎం సత్యనారాయణ రావు కన్నుమూత: తీరని కోరిక అదే
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్, మాజీమంత్రి ఎం సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిజాం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 3.45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. కరోనా వైరస్ బారిన పడి ఆయన కన్నుమూసినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. కుటుంబ సభ్యులెవరూ దాన్ని ధృవీకరించలేదు. ఆయన మరణం పట్ల ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎమ్మెస్సార్ తనదైన ముద్ర వేశారు. గాంధీ కుటుంబంతో ఆయనకు అనుబంధం ఉంది. తెలంగాణ ప్రజా సమితి ద్వారా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1971లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ తరఫున కరీంనగర్ నుంచి వరుసగా రెండుసార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్ లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి, అప్పటి టీఆర్ఎస్ కే చంద్రశేఖర్ రావుపై స్వల్ప తేడాతో ఓటమి చవి చూశారు.
Recommended Video
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా సత్యనారాయణ రావు పనిచేశారు. 2004 నాటి సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2006లో కరీంనగర్ లోక్సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి, కేసీఆర్పై ఓడిపోయారు. గవర్నర్గా పనిచేయాలనే కోరిక ఆయనకు బలంగా ఉండేది. తనను రాజ్భవన్కు పంపించమంటే బస్ భవన్ (ఆర్టీసీ ప్రధాన కార్యాలయం)కు పంపించారంటూ ఆయన చెబుతూ ఉండేవారు.