ఢిల్లీలో కెసీఆర్ దీక్ష.. హైదరాబాద్లో బీజేపీ దీక్ష.. దొంగడ్రామాలు, వీధినాటకాలు అంటున్న కాంగ్రెస్!!
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యం కొనుగోలు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగుతున్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ఎవరి వాదన వారిదే అన్నట్టు పరిస్థితి ఉండగా రైతాంగం మాత్రం దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉంది.
తెలంగాణా ధాన్యం రగడ ... టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ను టార్గెట్ చేస్తూ టిఆర్ఎస్ పార్టీ విమర్శలకు దిగుతుంటే, ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని, ఏ రాష్ట్రానికి రాని సమస్య తెలంగాణ రాష్ట్రానికే ఎందుకు వస్తుందని, కావాలని టిఆర్ఎస్ పార్టీ కేంద్రం మీద దుష్ప్రచారం చేస్తోందని బిజెపి నేతలు మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో అటు బిజెపి ని, ఇటు టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయి అంటూ మండిపడుతున్నారు.
బీజేపీ టార్గెట్ గా కేసీఆర్ ఢిల్లీలో రైతు దీక్ష... ధాన్యం కొనుగోలు డిమాండ్
ధాన్యం కొనుగోళ్ళ కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటాన్ని తీసుకు వెళ్ళింది టిఆర్ఎస్ పార్టీ. సోమవారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా తెలంగాణ రైతాంగం సాగుచేసిన ధాన్యం కొనుగోలు కోసం సీఎం హోదాలో కెసిఆర్ దీక్షకు దిగారు. ధాన్యం కొనుగోలు పై కేంద్రం వైఖరికి నిరసనగా దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో టిఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ రైతులు సాగు చేసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, దేశమంతటా ఒకే సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తూ కేంద్రం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
టీఆర్ఎస్, బీజేపీ దీక్షలపై కాంగ్రెస్ మండిపాటు
ఇక ఇదే సమయంలో హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ రైతుదీక్ష చేపట్టింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర రైతాంగం సాగుచేసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బీజేపీ కెసిఆర్ సర్కారుపై ఒత్తిడి తెస్తోంది. ఇదిలా ఉంటే రెండు పార్టీల తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేసి తెలంగాణ రైతాంగాన్ని మోసం చేయడానికి రెండు ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలుగా ప్రస్తుతం వారు చేస్తున్న దీక్షలను అభివర్ణించారు.
కెసీఆర్ ఢిల్లీలో, బీజేపీ హైదరాబాద్ లో దీక్షల డ్రామాలు, వీధినాటకాలు : మధు యాష్కీ గౌడ్
ఇక తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీలో వరి దీక్ష, బిజెపి నాయకులు హైదరాబాద్ లో వరి దీక్ష అంటూ ఎద్దేవా చేశారు. దీక్షలు చేసే వాళ్ళకు సిగ్గు ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవాళ్లు రైతులను వారి ఖర్మానికి విడిచిపెట్టి దీక్షలు చేస్తే వడ్లను ఎవరు కొనాలి అంటూ ఫైర్ అయ్యారు. రైతులను ఎవరు ఆదుకోవాలి అంటూ ప్రశ్నించారు. ఢిల్లీకి వేల మందితో వెళ్లి దీక్షలు చేసే వాళ్లు ఆ మొత్తం పెట్టి వడ్లు కొనొచ్చు కదా అంటూ మండిపడ్డారు. దొంగ డ్రామాలు, వీధి నాటకాలతో రైతుల బతుకులు ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. వరి రైతులకు ఉరేస్తున్న వీళ్ళను పాతాళానికి బొంద పెడితేనే రాష్ట్రం, రైతాంగం బాగుపడుతుందని మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.