కానిస్టేబుల్ భార్య ఆత్మహత్య: బాత్రూం పైకప్పు కూలి వ్యక్తి మృతి
హైదరాబాద్: హైదరాబాదులోని అంబర్పేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అంబర్పేటలోని పోలీసు క్వార్టర్స్లో పుష్పలీల (24) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆమె మరణించింది. పుష్పలీల భర్త అమర్నాథ్ సిపిఎల్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు.
పుష్పలీల, అమర్నాథ్ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. పుష్పలీల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనాస్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోటును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో బాత్రూం పైకప్పు కూలిపోవడంతో ఓ కార్మికుడు మరణించాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. గ్రామ పంచాయతీ ఉద్యోగి సాయిలు (50) జెడ్పీ హైస్కూల్లోని మరుగుదొడ్డిని శుభ్రం చేస్తుండగా పైకప్పు కూలింది. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మరణించాడు.
బాత్రూంలో ఫార్మసీ విద్యార్థి మృతి
మరుగుదొడ్డిలో కాలు జారి పడి ఓ ఎం ఫార్మసీ విద్యార్థి మరణించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లాలోని చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొడిసెల యాదగిరి, నర్సవ్వ దంపతుల కుమారుడు సతీష్ (23) ఎం. ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
సతీష్కు ఆదివారం గుండె నొప్పి రావడంతో సిద్ధిపేట ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతనికి గుండె సంబంధమైన సమస్య లేదని తేల్చారు. సోమవారం ఉదయం సతీష్ ఇంట్లో మరుగుదొడ్డికి వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు.
మరుగుదొడ్డిలో సతీష్ పడిపోవడాన్ని వారు గుర్తించారు. అతని తలకు బలమైన గాయమైంది. అయితే, అతను తలకు గాయమైన కారణంగానే మరణించాడా, గుండెపోటుతో మరణించాడా అనేది తేలాల్సి ఉంది.