సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో కరోనా కల్లోలం... 4 నెలల క్రితం భార్య,ఇప్పుడు భర్త కుమారుడు మృతి...
కరోనా మహమ్మారి దేశంలో ఆరోగ్య సంక్షోభాన్నే కాదు మరోసారి ఆర్థిక సంక్షోభాన్ని కూడా సృష్టిస్తోంది. ముఖ్యంగా దిగువ,మధ్య తరగతి కుటుంబాలపై కరోనా ప్రభావం ఎక్కువగా పడుతోంది. ఉద్యోగాలు,ఉపాధి కోల్పోయి కొందరు... వ్యాపారాలు దెబ్బతిని కొందరు ఆర్థికంగా దివాళా తీస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ కోసం అప్పులు చేసి నెట్టుకురావాల్సిన పరిస్థితి. ఇటు ఉద్యోగం కోల్పోయి... అటు అప్పటికే ఉన్న అప్పులు,ఈఎంఐల బాధలు భరించలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా హన్మకొండలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

అసలేం జరిగింది...
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాకతీయ కాలనీలో గొడిశాల(45) శ్రీధర్-తిరుమల(38) దంపతులు నివసిస్తున్నారు. వీరికి 9 ఏళ్ల కుమారుడు విష్ణువర్దన్ ఉన్నాడు. శ్రీధర్ స్వస్థలం పరకాల అయినప్పటికీ... బతుకుదెరువు కోసం 15 ఏళ్ల క్రితమే వరంగల్ వచ్చి స్థిరపడ్డాడు. స్థానికంగా ఓ కార్ల షోరూం కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం పెద్దమ్మగడ్డ కాకతీయ కాలనీ ఫేజ్-1లో సొంత ఇల్లు కట్టుకున్నాడు. అప్పటినుంచి అదే ఇంట్లో ఉంటున్నారు. శ్రీధర్ తల్లి కూడా పరకాల నుంచి వచ్చి వారితోనే ఉంటోంది.

సాఫీగా సాగుతున్న జీవితంలో కల్లోలం...
అంతా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో కరోనా కలకలం రేపింది. గతేడాది లాక్డౌన్ కారణంగా శ్రీధర్ పనిచేస్తున్న కార్ల షోరూం మూతపడింది. దీంతో అతని ఉద్యోగం పోయింది. నెలవారి వేతనమే అతని కుటుంబానికి ఆధారం. అలాంటిది ఒక్కసారిగా ఉద్యోగం పోవడంతో రోడ్డున పడినట్లయింది. కుటుంబ పోషణ కోసం అప్పులు చేశాడు. అదే సమయంలో ఇంటి కోసం చేసిన అప్పుకు వడ్డీలు పెరిగిపోయాయి. అప్పుల వాళ్లు ఇంటి మీదకి రావడంతో భార్యాభర్తలు అవమానంతో కుంగిపోయారు.

4 నెలల క్రితం భార్య... ఇప్పుడు భర్త,కుమారుడు...
ఇదే క్రమంలో శ్రీధర్ భార్య తిరుమల గతేడాది డిసెంబర్ 16న గుండెపోటుతో మృతి చెందింది. అప్పటినుంచి శ్రీధర్ మరింత కుంగిపోయాడు. ఓవైపు అప్పులు... మరోవైపు భార్య లేని లోటు... ఇక ఈ జీవితం వద్దని నిర్ణయించుకున్నాడు. శుక్రవారం రాత్రి కూల్ డ్రింక్స్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అందులో పురుగుల మందు కలిపాడు. భోజనం తర్వాత మొదట శ్రీధర్ తాగి... ఆ తర్వాత కొడుకు విష్ణువర్ధన్తో తాగించాడు. ఆపై ఇద్దరు నిద్రలోకి జారుకుని నిద్రలోనే మరణించారు. మరుసటిరోజు ఉదయం శ్రీధర్ తల్లి లీలావతి అతని గది తలుపు తట్టగా ఎంతకీ తీయలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లగా... అప్పటికే ఇద్దరూ విగతజీవులుగా మంచంపై ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications