అసెంబ్లీ వద్ద కరోనా పరీక్షలు: స్పీకర్, ఛైర్మన్ సహా నేతలు క్యూ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు మరింతగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడగా.. తాజాగా ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు కూడా ఈ మహమ్మారి సోకినట్లు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి.
అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కాగా, సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ స్టాఫ్, ఎమ్మెల్యేలకు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
శుక్రవారం అసెంబ్లీ వద్ద పరీక్షలు చేయించుకున్న మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కరోనా రిపోర్ట్ నెగిటివ్గా వచ్చింది. అయితే, మంత్రి హరీశ్ రావుకు మాత్రం కరోనా పాజిటివ్ అని తేలినట్లు వార్తలు వచ్చాయి.
అయితే, జూన్ నెలలోనే తన పీఏకి కరోనా సోకడంతో హరీశ్ రావు హోంక్వారంటైన్లోకి వెళ్లారు. సిద్దిపేటలోని ఆయన నివాసంలోని ఓ వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పుడు కూడా మంత్రి హరీశ్ రావు హైదరాబాద్లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.
Recommended Video
కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 1,35,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 32,994 యాక్టివ్ కేసులున్నాయి. 1,02,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 866 మంది కరోనా బారినపడి మృతి చెందారు.