కరోనా: తెలంగాణలో మరో 15 కొత్త కేసులు.. మొత్తం 943.. క్వారంటైన్ గడువు పెంపు రెట్టింపు..
కొవిడ్-19 కేసులకు సంబంధించి సౌత్ ఇండియాలో తమిళనాడు తర్వాతి స్థానంలో కొనసాగుతోన్న తెలంగాణలో.. కొత్తగా మరో 15 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 10 కరోనా కేసులు, సూర్యాపేటలో మరో 3 కేసులు, గద్వాలలో రెండు కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో బుధవారం రాత్రినాటికి మొత్తం కేసుల సంఖ్య 943కు పెరిగింది. అందులో ఇప్పటివరకు 194 మంది వ్యాధి నుంచి కోలుకోగా, 24 మంది చనిపోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 725గా ఉంది.
రాష్ట్రంలో మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా కొనసాగుతోన్న జీహెచ్ఎంసీలో బుధవారం నాటి 10 కొత్త కేసులతో కలిపి మొత్తం కేసులు 489కి చేరాయి. 73 కేసులతో సూర్యాపేట రెండో స్థానంలో ఉంది. సూర్యాపేట జిల్లాలో కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో అక్కడ ప్రత్యేక ఫోకస్ నిలిపారు. జిల్లాలో సుమారు 5వేల మందిని క్వారంటైన్ లో ఉంచినట్లు సమాచారం. కాగా,
కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా నిర్వహించడంలో భాగంగా హోం క్వారంటైన్ గడువును 14 రోజుల నుంచి ఏకంగా 28 రోజులకు పెంచుతూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి కొవిడ్-19 ఇంక్యూబేషన్ పీరియడ్ 14 రోజులే అయినప్పటికీ, ఇటీవల చాలా చోట్ల 14 రోజుల తర్వాత కూడా పాజిటివ్ వస్తుండటంతో సర్కారు ఈ మేరకు గడువు పెంచింది. అలాగే, వైరస్ బాధితుడితో ప్రైమరీ కాంటాక్టులకు మాత్రమే టెస్టులు నిర్వహించాలని, సెకండరీ కాంటాక్ట్ను టెస్ట్ చేయకుండా, హోం క్వారంటైన్లో ఉంచితే సరిపోతుందనీ ప్రభుత్వం సూచించింది.