ఐఐటీ హైదరాబాద్లో కరోనావైరస్ కలకలం: 119 మందికి కోవిడ్ పాజిటివ్
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రెండువేలకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రులు, కాలేజీల్లోనూ కేసులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా, ఐఐటీ హైదరాబాద్ (IIT Hyderabad)లో కరోనా కలకలం రేగింది.
హైదరాబాద్ ఐఐటీలో మొత్తం 119 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు యాజమాన్యం ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. విద్యార్థులకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. ఇందులో సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. ఐఐటీ హైదరాబాద్ వసతి గృహంలో వీరిని ఉంచడం జరిగిందని, ప్రత్యేకంగా ఐసోలేషన్ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని తెలిపింది.

గర్భిణికులకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్లు: మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ప్రభుత్వం అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించిందని, వాటిని పూర్తి స్ధాయిలో వినియోగించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖమంత్రి హరీష్ రావు ఆదేశించారు. అవసరమైతే తప్ప రోగులను హైదరాబాద్కు రిఫర్ చేయవద్దని వైద్యులకు సూచించారు. కోవిడ్ సోకిన గర్భిణిలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. వారికోసం ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో ఆపరేషన్ ధియేటర్లు, వార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కరోనా వైరస్ సోకిన ఇతర పేషెంట్లకు కూడా ప్రత్యేకంగా ఆపరేషన్ ధియేటర్లు, వార్డులు కేటాయించాలని ఆదేశించారు. అత్యవసర సేవలు, శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి కోవిడ్ సోకిందనే కారణంతో చికిత్స అందించేందుకు నిరాకరించవద్దని స్పష్టం చేశారు.
జిల్లా వైద్య అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి ఎప్పటికప్పడు పరిస్ధితులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
కోవిడ్ తగ్గుముఖం పట్టేంతవరకు బస్తీ దవాఖానాలు, పీహెచ్సీలు, సబ్ సెంటర్లు, ఆదివారం కూడా పని చేయాలని హరీష్ రావు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి పీహెచ్సీలో రాత్రి 10 గంటల వరకు వ్యాక్సినేషన్ చేపట్టాలని సూచించారు.
కోవిడ్ లక్షణాలతో ఎవరు వచ్చినా పరీక్షించాలని, పాజిటివ్ వచ్చిన వారికి కిట్లు ఇవ్వటంతో పాటు వారి ఆరోగ్య పరిస్ధితి తెలుసుకుంటూ వారికి వైద్యం అందించాలని హరీష్ రావు ఆదేశించారు. కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడి మున్సిపల్ సిబ్బందికి, పోలీసు వారికి బూస్టర్ డోస్ వేసేలా సమన్వయంతో పని చేయాలని డీఎంహెచ్ఓలకు మంత్రి హరీష్ రావు సూచించారు.












Click it and Unblock the Notifications