తెలంగాణలో భారీగా కరోనా కేసులు: 965 కొత్త కేసులు, జీహెచ్ఎంసీలో డబుల్ సెంచరీ దాటాయి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 59,343 నమూనాలను పరీక్షించగా.. గురువారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 965 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మరో 254 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో గురువారం ఐదుగురు మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించినవారి సంఖ్య 1,706కి చేరింది. కరోనా బారినుంచి గురువారం 312 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,159 యాక్టివ్ కేసులున్నాయి. వారిలో 2622 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు.
మేడ్చల్లో 110, రంగారెడ్డిలో 97, నిజామాబాద్లో 64, జగిత్యాలో 35, నిర్మల్లో 39 కేసులు నమోదయ్యాయి. మనదేశ జాతీయ మరణాల రేటుతో పోల్చితే తెలంగాణ మెరుగ్గానే ఉంది. భారత్ కరోనా మరణాల రేటు 1.3గా ఉంటే.. తెలంగాణలో మాత్రం 0.55గా ఉంది.
జాతీయ రికవరీ రేటు 93.7గా ఉంటే తెలంగాణలో 97.46గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటి 2లక్షల 70వేల 249 కరోనా పరీక్షలు చేశారు. తెలంగాణలో ప్రతి 10 లక్షల మందిలో 2,75,933 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు.