విచారణ జరపండి, ఉరి శిక్షకూ సిద్ధం: కేసీఆర్కు కోమటిరెడ్డి సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రతీ శాఖలోనూ అవినీతి చోటు చేసుకుంటుంద
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంలోని ప్రతీ శాఖలోనూ అవినీతి చోటు చేసుకుంటుందని ఆరోపించారు.
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు స్కాంలని అని అన్నారు. అమృత్ పథకంలోనూ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. కాంట్రాక్టులను కూడా తమవారికే ఇచ్చుకున్నారని మండిపడ్డారు. వీటన్నింటిపైనా విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.
అంతేగాక, తన ఆరోపణలు తప్పని తేలితే.. తనపై కేసులు పెట్టాలని అన్నారు. తాను ఎరికీ భయపడనని, తాను జైలు కెళ్లడానికైనా, ఉరిశిక్షకైనా సిద్ధమేనంటూ సీఎం కేసీఆర్కు కోమటి రెడ్డి సవాల్ విసిరారు. చేపల పెంపకంలోనూ అవినీతి చోటు చేసుకుందని అన్నారు.
కాగా, ఏ శాఖపనైనా అనవసర అవినీతి ఆరోపణలు చేస్తే ఆ శాఖ మంత్రులు వారిపై కేసులు పెట్టించాలని టిఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరైనా అభ్యంతరం లేదు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని నియమించినా తమకు అభ్యంతరం లేదని, వారితో కలిసి పనిచేస్తామని మాజీ ఎంపీ, శాసనమండలి సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ... గూడూరు నారాయణరెడ్డితో గొడవ సద్దుమణిగిందని, 2019లో కాంగ్రెస్ను అధికారంలో తేవడానికి ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే అన్ని పార్టీలలో గ్రూపు రాజకీయాలున్నాయని, కాంగ్రెస్లో ఎన్ని గ్రూపులున్నా అధిష్ఠాన నిర్ణయం మేరకు పనిచేస్తామని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.