ఆల్టైమ్ రికార్డ్ సృష్టించిన పత్తి ధర.. 50ఏళ్ల తర్వాత తొలిసారిగా; రైతన్నల్లో సంతోషం!!
ఆరుగాలం శ్రమించి తెల్ల బంగారాన్ని సాగుచేసిన రైతన్నలకు ఈసారి తెల్ల బంగారం కనక వర్షం కురిపిస్తుంది. పత్తి ధర పరుగులు పెడుతోంది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో 50 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మంగళవారం క్వింటా పత్తి ధర 14 వేల రూపాయలు పలికింది. అంతేకాదు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాటన్ మార్కెట్ లో కూడా క్వింటా పత్తి గరిష్ట ధర 14 వేల రూపాయలు పలికింది. ఈ ధర పత్తికి ఆల్ టైం రికార్డు ధరగా నమోదయింది. మార్కెట్ లో పత్తి రైతన్నల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది.
రికార్డ్ సృష్టించిన పత్తి ధర .. 14 వేలకు క్వింటాల్
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఒకే రోజు 1500 బస్తాలు, 750 క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఇక ఈ సీజన్ లో ఈ నెల పత్తి విక్రయానికి ఆఖరు నెల కావటంతో మార్కెట్ కు తెల్ల బంగారం పోటెత్తుతుంది. జనగామ జిల్లా జఫర్గడ్ మండలం కూనూరు గ్రామానికి చెందిన రైతు యాట ప్రభాకర్ 20 బస్తాల పత్తిని విక్రయించడానికి తీసుకువస్తే గరిష్ట ధర నమోదయింది. ఒక్కసారిగా తన పత్తికి 14 వేల రూపాయలు ఇస్తామని చెప్పడంతో అతడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. ఇలా అనేక ప్రాంతాల నుండి పత్తి తీసుకువచ్చిన రైతులు ధర బాగా పలుకుతుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో పత్తికి డిమాండ్ .. పత్తి అమ్మకానికి సరైన సమయం
అంతర్జాతీయ మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న కారణంగా ధర రికార్డు స్థాయికి చేరుకుందని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి బి.వి. రాహుల్ పేర్కొన్నారు. గోడౌన్లలో పత్తి నిల్వలు ఉంచుకున్న రైతులు ప్రస్తుతం ఉన్న అధిక డిమాండ్ నేపథ్యంలో పంటలను విక్రయించు కోవాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది క్వింటా పత్తికి మద్దతు ధర 6,025 రూపాయలుగా ప్రకటించగా, ప్రస్తుతం అదనంగా 7975 రూపాయలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు వ్యవసాయంలో నష్టాలను చవి చూసే రైతులు ఈ సారి, తెల్లబంగారం సిరులు కురిపిస్తున్న నేపథ్యంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మొన్న మిర్చి, ఇప్పుడు పత్తి ఆల్ టైం రికార్డ్ ధరలు .. రైతన్నలలో హర్షం
ఇదిలా ఉంటే ఇటీవల ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు బంగారంతో పోటీ పడిన పరిస్థితి చూశాం.పసిడితో పోటీ పడుతూ ఎర్రబంగారం దూసుకుపోయింది. మిర్చి ధరలు ఆకాశాన్నంటడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో క్వింటాల్ ఎర్ర మిర్చి ధర రికార్డు స్థాయిలో 52,000 పలికింది. బంగారంతో పోటీ పడుతూ మిర్చి ధరలు పెరగటం మిర్చి సాగు చేసిన రైతన్నలకు సంతోషం కలిగించింది. ఇప్పుడు పత్తి రైతుల్లోనూ ఆనందం వెల్లివిరుస్తుంది.