భార్యాభర్తల దాష్టీకం: రూ.250కి ముంబై బాలికను కొని బిచ్చమెత్తిస్తున్నారు
హైదరాబాద్: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో అమానుషమైన సంఘటన వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా బషీరాబాద్కు చెందిన దంపతులు ముంబై నుంచి రూ.250కి 13 ఏళ్ల బాలికను కొనుగోలు చేశారు. తాండూరు బస్సు స్టాండులో ఆ బాలికతో బిచ్చమెత్తిస్తున్నారు. గత మూడు నెలలుగా ఆ బాలిక అక్కడ బిచ్చమెత్తుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
బాలికకు పోలీసులు ఆ దంపతుల నుంచి విముక్తి కలిపించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వి బసమ్మ, వి. రాములు అనే భార్యాభర్తలు తాము ముంబైలో పనిచేస్తున్న సమయంలో ఏడాది క్రితం ముంబైకి చెందిన పూజ అనే బాలికను గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేశారని రంగారెడ్డి జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి చెప్పారు.
బాలిక అనాథ. ఆమెకు తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఆ భార్యాభర్తలు బాలికను తమ స్వగ్రామం మంతటికి తీసుకుని వచ్చి ఇంటి పనులు చేయిస్తూ వచ్చారు. ఆ తర్వాత బిచ్చమెత్తి తీసుకుని రావడానికి బయటకు పంపుతూ వచ్చారు. సాయంత్రం వరకు తాండూరు బస్ స్టాండులో బిచ్చమెత్తి దాతలు ఇచ్చిన డబ్బులను బాలిక ఆ భార్యాభర్తల చేతుల్లో పెడుతూ వస్తోంది.
జనవరి 7వ తేదీన సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలికకు విముక్తి కలిగించారు. మనుషుల అక్రమ రవాణా కింద భార్యాభర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బసమ్మ తండ్రి వి. పెంటయ్యను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో బలవంతంగా బిచ్చమెత్తుతున్న 300 మంది బాలికలకు పోలీసులు విముక్తి కలిగించారు.