కేసీఆర్ కు కరోనా.. విజయశాంతి సంచలనం.. రోజులు దగ్గరపడ్డాయని ఫైర్.. గవర్నర్ కీలక చర్యలు..
కరోనా కేసులకు సంబంధించి పాజిటివ్ రేటు భయానక స్థాయిలో ఉండటం, రోజురోజుకూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటం తెలంగాణలో ఆందోళనకరంగా మారింది. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో 30 మంది ఉద్యోగులు పాజిటివ్ గా తేలారని, సీఎం కేసీఆర్ కూడా కరోనా కాటుకు గురై, గజ్వల్ లోని ఫామ్ హౌజ్ లో చికిత్స పొందుతున్నారంటూ మంగళవారం కూడా సోషల్ మీడియాలో ప్రచారం కొనసాగుతోంది. దీనికి ప్రభుత్వంగానీ, టీఆర్ఎస్ పార్టీగానీ వివరణ ఇవ్వకపోవడంతో కన్ఫ్యూజన్ తొలిగిపోలేదు. సీఎం అందుబాటులో లేని వేళ.. కొవిడ్ నియంత్రణపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక చర్యలకు ఉపక్రమించారు. ఈ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ ఎక్కడ?
ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసి, అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, కేసీఆర్ ఎక్కడున్నారనేదే ఇప్పుడు తెలంగాణాలో హాట్ టాపిక్గా మారిందని విజయశాంతి అన్నారు. మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ మేరకు సుదీర్ఘ ప్రకటన చేశారామె.

ఆ రోజులు దగ్గర్లోనే..
కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రతిపక్షాలు హెచ్చరిస్తే సీఎం కేసీఆర్ అవహేళన చేశారని, కరోనా కట్టడికి తగిన వైద్య వసతులు లేవని పత్రికల్లో వార్తలు వస్తే.. వాటి యాజమాన్యాలకు శాపనార్థాలు పెట్టారని, చివరికి కరోనా పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టినా సీఎం పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత గుర్తుచేశారు. ‘‘శిశుపాలుడి తప్పుల మాదిరిగా, కేసీఆర్ తప్పులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన కేసీఆర్.. తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి..''అని ఆమె హెచ్చరించారు.

గవర్నర్ జోక్యంపై ప్రజల హర్షం..
తెలంగాణలో కరోనా పరిస్థితుల చేయిదాటుతోన్న వేళ, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా జోక్యం చేసుకుని, సంక్షోభ నివారణకు చొరవ తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నానని, గవర్నర్ చర్యల పట్ల ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని విజయశాంతి అన్నారు. అయితే, గవర్నర్ కు కూడా అడ్డంతగిలేలా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆయన నిరంకుశత్వానికి పరాకాష్ట అని, సీఎం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైన కారణంగానే గవర్నర్ జోక్యం చేసుకునే పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ నేత చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ కరోనా కట్టడికి ముందుకురాకుంటే, తెలంగాణ సమాజం ఆగ్రహం తారాస్థాయికి చేరుతుందని విజయశాంతి అన్నారు.

ప్రైవేటు యాజమాన్యాలతో కాన్ఫరెన్స్..
కరోనా విజృంభిస్తోన్న వేళ ప్రభుత్వ పరంగా సరైన వైద్యం అందడంలేదంటూ పలువురు బాధితులు మొరపెట్టుకున్న దరిమిలా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. సమీక్షకు రావాల్సిందిగా చీఫ్ సెక్రటరీని పిలిచినా ఎవరూ హాజరుకాలేదు. దీంతో మంగళవారం ఆమెనే హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డజనుకుపైగా ప్రముఖ ఆస్పత్రుల ప్రతినిధులతో మాట్లాడిన గవర్నర్ కీలక సూచనలు చేసినట్లు తెలిసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ఐసోలేషన్ సౌకర్యాలు, పరీక్షలు, బిల్లులు తదితర వ్యవహారాలపై చర్చిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications