అలర్ట్: నలుగురు కరోనా ఖైదీలు పరార్ - గాంధీ ఆస్పత్రి గ్రిల్స్ తొలగించి జంప్ - వాళ్ల వివరాలివే..
ఆ నలుగురూ కరడుగట్టిన నేరస్తులు.. అందులో ఇద్దరికి ఇప్పటికే శిక్షలు కూడా ఖరారయ్యాయి.. అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి తరలించారు.. అక్కడ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గాంధీలో చేర్చారు.. కానీ వాళ్ల ఆలోచన వేరేలా ఉంది.. ఇంతకు మించి మరో అవకాశం రాదేమోనని.. కొవిడ్ వార్డులోని బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఎస్కేప్ అయ్యారు.. దీనిపై హెచ్చరిక జారీ చేసిన పోలీసులు.. ఆ నలుగురి వివరాలను తెలియజేశారు..

సినీ ఫక్కీలో..
గాంధీ ఆస్పత్రి కొవిడ్ వార్డు నుంచి నలుగురు ఖైదీలు పరారయ్యారన్న వార్త కలకలం రేపుతున్నది. చర్లపల్లి జైలుకు చెందిన ఈ నలుగురూ కొద్ది రోజుల కిందట అస్వస్థతకు గురికావడంతో అధికారులు వాళ్లను ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా టెస్టులు చేయగా, నలుగురికీ పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. ఆ వెంటనే అందరినీ కొవిడ్ డెడికేటెడ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. గురువారం తెల్లవారుజామున సినీ ఫక్కీలో ఆస్పత్రి మెయిన్ బిల్డింగ్లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి పారిపోయారు.

పోలీసుల కళ్లుగప్పి..
చర్లపల్లి జైలులో పటిష్టమైన భద్రత మధ్య గడిపి వచ్చిన నలుగురు ఖైదీలు.. గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ తక్కువగా ఉండటాన్ని అవకాశంగా తీసుకున్నారు. గాంధీలో ఖైదీల కోసం ప్రత్యేక వార్డులు ఉన్నాయి. అక్కడ తగినంత మంది పోలీసులు కూడా కాపలా ఉంటారు. అయితే ప్రస్తుత కరోనా సీజన్ లో పరిస్థితులు కొంత మారినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున కూడా అక్కడ పోలీసులు డ్యూటీలోనే ఉన్నారు. కానీ.. బాత్ రూమ్ వంకతో ఖైదీలు పోలీసుల కళ్లుగప్పి పారిపోవడం గమనార్హం. అయితే, వాళ్లు గాంధీ ఆస్పత్రి ప్రహారీ దాటి బయటికి వెళ్లిపోయారా లేక ఆస్పత్రిలోనే ఏదో ఒక మూల దాక్కున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు జరిగింది.

ఆ నలుగురు వీళ్లే..
ఖైదీలు పారిపోయినట్లు నిమిషాల వ్యవధిలోనే పోలీసులు గుర్తించారు. ఆస్పత్రిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా వాళ్లు ఎటుపోయిందీ గుర్తించి, గాలింపు చేపట్టారు. కొవిడ్ వ్యాధితో చికిత్స పొందుతూ గాంధీ నుంచి పారిపోయిన ఆ నలుగురిపైనా చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వాళ్ల వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఎస్కేపైన ఖైదీల్లో 1.అబ్దుల్ రబాజా (రాజేంద్రనగర్ లో కేసులో నిందితుడు), 2.ఎండీ జావీద్ శ్యామ్ (తాండూరు కేసులో నిందితుడు), 3.సుందర్(శిక్ష పడిన ఖైదీ), 4.నర్సింహా(శిక్ష పడిన ఖైదీ) ఉన్నారని తెలిపారు.
Recommended Video

ఏపీకి దీటుగా తెలంగాణ టెస్టులు..
తెలంగాణ వైద్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,018 కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1.11 లక్షలకు, మరణాల సంఖ్య 780కు పెరిగింది. ఇప్పటికే 85,223 వ్యాధి నుంచి కోలుకోగా, యాక్టివ్ కేసులు 25,685గా ఉన్నాయి. కాగా, కరోనా టెస్టుల నిర్వహణలో దేశంలోనే టాప్3లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు దీటుగా తెలంగాణలోనూ టెస్టుల సంఖ్య పెరగడం గమనార్హం. బుధవారం ఏపీలో 61,838 శాంపిళ్లను పరీక్షించగా, తెలంగాణలో 60,386 టెస్టులు చేశామని బులిటెన్ లో పేర్కొన్నారు. ఓవరాల్ గా తెలంగాణలో 11.42లక్షల శాంపిల్స్ ను పరీక్షించగా, ఏపీలో ఆ సంఖ్య 34.18లక్షలుగా ఉంది.












Click it and Unblock the Notifications