నేతలకు నార్కో టెస్ట్లు: నయీం కేసులో నారాయణ, కృష్ణయ్యపై వింధ్యా
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు, పోలీసులకు నార్కో టెస్ట్ నిర్వహించాలని సిపిఐ నేత నారాయణ మంగళవారం నాడు డిమాండ్ చేశారు. నయీం కేసులో సిట్తో ఉపయోగం లేదన్నారు. సీబీఐతో దర్యాఫ్తు చేయించాలని డిమాండ్ చేశారు.
నా భర్తను నయీమే చంపాడు: పటోళ్ల వింధ్యా రెడ్డి
తన భర్తను నయీమే చంపాడని పటోళ్ల గోవర్ధన్ రెడ్డి భార్య పటోళ్ల వింధ్యా రెడ్డి మంగళవారం నాడు అన్నారు. నయీం అనుచరుల నుంచి తమ కుటుంబానికి ప్రాణ భయం ఉందని చెప్పారు. ఆర్ కృష్ణయ్య తప్ప తమను ఎవరూ ఆదుకోలేదన్నారు.
తన భర్త గోవర్ధన్ రెడ్డితో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్యతో మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరువురు మామ అని పిలుచుకునే వారన్నారు. తాను కూడా అన్నయ్య అని పిలుస్తానన్నారు. తమను ఆయన ఆదుకున్నారని చెప్పారు.
నయీంతో ఆర్ కృష్ణయ్యకు సంబంధాల పైన స్పందిస్తూ తనకు ఆ విషయాలు ఏమీ తెలియవన్నారు. తన భర్త మాత్రం ఆర్ కృష్ణయ్య అనుచరుడు అన్నారు. తనకు తెలిసినంత వరకు చంద్రబాబు టిక్కెట్ ఇస్తే, ఆర్ కృష్ణయ్య గెలిచారన్నారు.
నయీం కేసులో పోలీసులకు, నేతలకు నోటీసులకు రంగం సిద్ధం
నయీం కేసును సిట్ దర్యాఫ్తు చేస్తోన్న విషయం తెలిసిందే. దర్యాఫ్తు ఆధారంగా పలువురు పోలీసులకు, నాయకులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 30 మంది పోలీసులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. పలువురి ప్రమేయం పైన సిట్ ఆధారాలు సేకరించిందని తెలుస్తోంది. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్సైల వరకు ఇందులో ఉన్నారని సమాచారం.
ఇదిలా ఉండగా నార్సింగ్ పోలీస్ల పిటిషన్ను విచారించిన నయీం భార్య హసీనా, సోదరి సాజిదా షాహీన్ రాజేంద్రనగర్ కోర్టు, శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ల పిటిషన్ను విచారించి శంషాబాద్ ఆర్జీఐ కోర్టు ఫయీంకు 10 రోజులు, శ్రీహరికు 8 రోజుల కస్టడీ విధించాయి.
నయీం సోదరి ఆయేషా బేగం, బావ సలీంను భువనగిరి పోలీస్లు సోమవారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. భువనగిరిలో బెదిరింపులతో భూ ఆక్రమణకు పాల్పడినట్టు నమోదైన కేసుల్లో మెదక్ జిల్లా కోహిరాలో వారిని అరెస్ట్ చేశారు. భువనగిరి అదనపు ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.
మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తిలో ఓ వ్యాపారవేత్తను బెదిరించిన కేసులో నయీం అనుచరులు శ్రీను అలియాస్ రమాకాంత్, రమేశ్ అలియాస్ దివాకర్ (హోం గార్డు)ను తమ కస్టడీకి ఇవ్వాలని ఆమనగల్లు సీఐ రవీంద్ర ప్రసాద్ కల్వకుర్తి మున్సిఫ్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు.