గడ్డం లక్ష్మి.. కన్నేస్తే ఖతమ్ : క్రైమ్ లో సెంచరీ మార్క్
మేడ్చల్ : క్రైమ్ లో సెంచరీ మార్క్ ను చేరుకుంది. వెళ్లిన ప్రతీచోటా.. ఇళ్లను గుల్ల చేస్తూ అందినకాడికి దోచుకుంది. ఒకటా.. రెండా.. ఆమె చేతివాటానికి బలైన ప్రాంతాల జాబితానే చాంతాడంత ఉంది. నగరంలోని 10 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆమె పేరు మీద దాదాపు 100 కేసులు నమోదయ్యాయంటేనే దొంగతనాల్లో ఆమెది ఏపాటి రికార్డో అర్థం చేసుకోవచ్చు.
ఒకసారి జైలుకు వెళ్లి బయటకు వచ్చినా.. దొంగ బుద్ది పోనిచ్చుకోలేదు. మళ్లీ తన చేతివాటానికి పని చెప్పి, పలు ఇళ్లలో భారీ దోపిడీలకు పాల్పడిన సదరు యువతిని పోలీసులు పక్కాగా వల పన్ని పట్టుకున్నారు.
మేడ్చల్ రేల్వేస్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న గడ్డం లక్ష్మి (34) అలియాస్ చెంచులక్ష్మి అలియాస్ గుండ్ల పోచమ్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు దొంగతనాల్లో ఆమెకు సహకరిస్తున్న చెంచులక్ష్మి వదిన మంగమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ.7 లక్షల 75 వేల నగదుతో పాటు 24.8 తులాల బంగారం, 72.8 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
షేట్ బషీర్ బాద్ ఏసీపీ అశోక్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ విభాగ ఏసీపీ ఉషారాణి మేడ్చల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి గడ్డం లక్ష్మి క్రైమ్ హిస్టరీని బయటపెట్టారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. కూలీ పనులు చేస్తున్నట్టుగా నమ్మించి, తాళం వేసి ఉన్న ఇళ్ల కోసం పగటి పూట రెక్కీ నిర్వహించి దొంగతనాలకు పాల్పడుతుంటారు నిందితులు.
గడ్డం లక్ష్మి తాను దొంగిలించిన సొమ్మును తన వదిన మంగమ్మ వద్ద భద్రపరిచేది. ఇదే క్రమంలో గతేడాది జూలైలో మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమానగర్, వినాయకనగర్,వెంకటరామయ్య కాలనీలో తాళం వేసి ఉన్న ఇళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా.. షేట్ బషీర్ బాద్ ఏసీపీ అశోక్ కుమార్, సైబరాబాద్ క్రైమ్ విభాగ ఏసీపీ ఉషారాణి, సైబరాబాద్ సీసీఎస్ క్రైమ్ కంట్రోల్ స్టేషన్ సీఐ సైదులు, మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి దీనిపై సంయుక్త దర్యాప్తు జరిపి ఎట్టకేలకు నిందితురాలిని పట్టుకోగలిగారు.
గడ్డం లక్ష్మి చేతివాటానికి బలైన ప్రాంతాల చిట్టా భారీగానే ఉంది. మేడ్చల్, కేపీహెచ్ బీ, జీడిమెట్ల, దుండిగల్, శామీర్ పేట్, జహీరాబాద్, మహబూబ్ నగర్ జిల్లా ఆయిజ, కర్నూలు జిల్లాలోని చెగలమర్రి, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో నల్లకుంట, ఆసిఫ్ నగర్, హుమాయున్ నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, లంగర్ హౌజ్, కుల్సుంపురా, తిరుమలగిరి, ఉప్పల్, బోయిన్ పల్లి, సనత్ నగర్ ఇలా తాను కాలు పెట్టిన చోటల్లా తన చోర విద్యను ప్రదర్శించింది. దీంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆమెపై దాదాపు 100 కేసుల దాకా నమోదవడం గమనార్హం.
ప్రస్తుతం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది. తాజాగా ఆమెపై పీడీ యాక్ట్ కూడా పెట్టే ఆలోచనలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.