cyber crimes: సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో సైబర్ వల.. బీ అలెర్ట్!!
డిజిటల్ చెల్లింపుల విధానం దేశంలో పెరిగిన దగ్గరనుండి సైబర్ మోసాలు కూడా అంతే స్థాయిలో పెరుగుతున్నాయి. చిన్న అవకాశం దొరికినా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. చదువుకున్న వారిని సైతం చిటికలో మోసం చేస్తున్నారు. సైబర్ నేరాలు చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో? ఎన్ని అడ్డదారులు ఉన్నాయో? అన్నింటినీ ఉపయోగించి అమాయకుల బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారు.

సీఎం రిలీఫ్ ఫండ్ ను వదలని సైబర్ నేరగాళ్ళు
మీకు లక్కీ డ్రా వచ్చింది.. మీకు బంపర్ ఆఫర్ వచ్చింది.. మీకు కౌన్ బనేగా కరోడ్పతి లో స్పెషల్ గిఫ్ట్ వచ్చింది.. ఇలా అనేక రకాలుగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు తాజాగా మరో కొత్త పేరుతో దోపిడీ మొదలు పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ వ్యాధుల బారిన పడి ఆసుపత్రులలో చికిత్స కోసం ఇబ్బంది పడుతున్న వారికి అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ ను కూడా వదలకుండా సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీశారు.

నమ్మి అకౌంట్ డీటైల్స్ పంపితే జరిగేదిదే
సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని, మీకు రావాల్సిన డబ్బులు మీ ఖాతాలోనే వేస్తామని కాల్ చేసి చెప్తున్నారు. ఇక నమ్మి వారితో సానుకూలంగా మాట్లాడితే మీ డబ్బు జమ చేయడానికి మీ అకౌంట్ డీటెయిల్స్ పంపమని అడుగుతున్నారు. ఫోన్ చేసి, జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్న సైబర్ నేరగాళ్లు, నిజంగానే తమకు సిఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందని నమ్మినవారిని నిలువునా మోసం చేస్తున్నారు. వారి అకౌంట్ డీటెయిల్స్ తెలుసుకొని, వారి బ్యాంకు ఖాతాల నుండి నగదు మాయం చేస్తున్నారు.

సైబర్ నేరాల పట్ల అలెర్ట్... బీ కేర్ ఫుల్
అందుకే తెలంగాణ పోలీసులు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెబుతున్నారు. ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి ఏది పడితే అది చెబితే నిజమని నమ్మొద్దని సూచిస్తున్నారు. దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిన క్రమంలో అప్రమత్తత అవసరం అంటున్నారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్పొద్దని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా అనుమానం వస్తే తక్షణం 1930 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. తెలంగాణ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లో ఎప్పటికీ సిబ్బంది బాధితులకు తక్షణ సహాయం అందించడానికి అందుబాటులో ఉంటారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications