రోహిత్ ఆత్మహత్య: సుశీల్ కుమార్పై తేల్చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్: అంబేడ్కర్ స్టూడెంట్స్ యూనియన్ (ఎస్ఎ) విద్యార్థుల దాడి వల్ల జరిగిన గాయాలకు చికిత్స పొందేందుకు ఆస్పత్రిలో చేరినట్లు ఎబివిపి విద్యార్థి నందనం సుశీల్ కుమర్ చేస్తున్న వాదనను సైబరాబాద్ పోలీసులు కొట్టిపారేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి, ఏబీవీపీ నాయకుడు నందనం సుశీల్కుమార్, ఎఎస్ఎ విద్యార్థుల మధ్య జరిగిన ఘటనలో సుశీల్కు స్వల్పగాయాలే అయ్యాయని పోలీసులు హైకోర్టుకు నివేదించారు.
గొడవలో తగిలిన గాయాలకు చికిత్స కోసం సుశీల్ ఆసుపత్రిలో చేరలేదని, అపెండిసైటీస్ చికిత్సకోసమే చేరాడంటూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ సివి ఆనంద్ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇదే వివాదంలో సుశీల్ కుమార్కు రక్షణ కల్పించాలని కోరుతూ అతని తల్లి వినయ నిరుడు ఆగస్టు 27న పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంలో సీపీ కౌంటర్ వేశారు.
నిరుడు ఆగస్టు 4న ఉదయం 6.30 గంటలకు గచ్చిబౌలి మదీనాగూడలోని అర్చన హాస్పిటల్ నుంచి మెడికో లీగల్ కేసు వచ్చినట్లు సమాచారం అందడంతో సబ్ ఇన్స్పెక్టర్ అక్కడకు వెళ్లి బాధితుని నుంచి ఫిర్యాదు తీసుకుని ఐపీసీ సెక్షన్లు 448, 341, 506, 232 రెడ్విత్ 147 కింద క్రైం నెం.296/2015తో కేసును నమోదు చేసినట్లు వివరించారు.
ఈ ఘటన విశ్వవిద్యాలయం అనుబంధ హాస్టల్లోని సుశీల్ కుమార్ ఉంటున్న రూం నెం. 113లో జరిగిందని చెప్పారు. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకూబ్ మెమన్ను ఉరితీయడాన్ని నిరసిస్తూ ఏఎస్ఎ విద్యార్థి వర్గం వర్సిటీ ఆవరణలో ప్లకార్డులతో నిరసన తెలిపారని, ఈ నిరసనను తీవ్రంగా వ్యతిరేకించిన సుశీల్ ఫేస్బుక్లో కామెంట్లు పోస్ట్ చేశాడని, దీనిపై ఆగ్రహించిన ఏఎస్ఎ విద్యార్థులు ఆగస్టు 3న సుశీల్ గదికి వెళ్లి ఘర్షణ పడ్డారని వివరించారు.
తన కామెంట్లు ఉపసంహరించుకుంటున్నట్లు బలవంతంగా పేస్బుక్లో పోస్టింగ్ పెట్టించారని, ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో సుశీల్ స్వల్పంగా గాయపడ్డాడని కౌంటర్లో వివరించారు. విచారణలో భాగంగా పిటిషనర్(సుశీల్ తల్లి) వినయతో పాటు సోదరుడు విష్ణు, ఆ రోజు విధుల్లో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ ఎస్. దిలీప్ సింగ్, అతని రూంమేట్ ఆనంద్ను విచారించామని, సుశీల్కు చికిత్స చేసిన డాక్టర్ పి. చెన్నారెడ్డినీ విచారించి మెడికల్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తెలిపారు.
సుశీల్తో ఏఎస్ఎ విద్యార్థులు రాయించుకున్న క్షమాపణ పత్రాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. అపెండిసైటిస్తో బాధపడుతూనే సుశీల్ హాస్పిటల్కు వచ్చినట్లు తేలిందని, చికిత్స తర్వాత కోలుకున్న అతడిని డిశ్చార్జి చేశారని తెలిపారు. విద్యార్థి సంఘాలతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుశీల్ తల్లి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. పోలీసుల సమక్షంలోనే కొట్టినట్లు పిటిషనర్ చేసిన ఆరోపణలు నిరాధరమన్నారు.