మూడెకరాలు-మృత్యు కౌగిలి: ఉసురు తీసిందెవరు?, బలైపోయిన శ్రీనివాస్..
బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.
హైదరాబాద్/కరీంనగర్: దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. ప్రకటనలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఆచరణలో చూపించడం లేదన్న విమర్శలున్నాయి. ఒకవేళ ఇచ్చినా.. అందులోను ఎమ్మెల్యేల జోక్యంతో అర్హులకు అన్యాయం జరుగుతుండటం కళ్లెదుట కనిపిస్తున్న వాస్తవం.
కేసీఆర్కు మంథని దెబ్బ:మూడెకరాలు పోయి ఆరడగుల జాగనా?, 'మధుకర్' ఘటనపై పెల్లుబికిన ఆగ్రహం
ఈ అన్యాయానికి మానకొండూరు యువకుడు మహంకాళి శ్రీనివాస్(26) బలైపోయాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గునూరులో మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంపు కార్యాలయం ఎదుట కొద్దిరోజుల క్రితం అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం అతన్ని యశోద ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నాం కన్నుమూశాడు.
22రోజులుగా మృత్యువుతో పోరాటం:
దళితులకు భూ పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు రావలసిన మూడెకరాల భూమి దక్కలేదని మహంకాళి శ్రీనివాస్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. భూమి కోసం రూ.20వేలు చెల్లించాల్సిందిగా శ్రీనివాస్ ను స్థానిక రెవెన్యూ అధికారి డిమాండ్ చేసినట్లుగా కూడా ఆరోపణలున్నాయి.
అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై విసిగిపోయిన శ్రినివాస్ ఎమ్మెల్యే బాలకిషన్ ఆఫీసు ఎదుటే ఈ నెల 3న ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
అతనితో పాటు యాలాల పరుశురాములు అనే మరో యువకుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనలో మహాంకాళి శ్రీనివాస్ శరీరం పూర్తిగా కాలిపోగా, పరశురాములు తీవ్రంగా గాయపడ్డాడు. 22రోజులుగా మృత్యువుతో పోరాడిన శ్రీనివాస్.. ఆదివారం కన్నుమూశాడు.
రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా డిమాండ్:
యువ రైతు మహంకాళి శ్రీనివాస్ మృతి పట్ల ప్రతిపక్షాలు, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని, రూ. 50 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, రైతు మృతికి కారకుడైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో బిజెపి, టిడిపి, కాంగ్రెస్, సిపిఐ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పలుచోట్ల ఎమ్మెల్యే రసమయి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు జరిగాయి.
మానకొండూర్ బంద్:
యువరైతు మహంకాళి శ్రీనివాస్ మృతికి నిరసనగా టీడీపీ సోమవారం మానకొండూరు నియోజకవర్గం బంద్కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం వద్ధ పోలీసులు భారీగా మోహరించారు.
రక్త సంబంధీకుడిని కోల్పోయాను: బాలకిషన్
శ్రీనివాస్ మృతిపై ఎమ్మెల్యే, సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్ స్పందించారు. శ్రీనివాస్ మృతి బాధాకరమని, రక్త సంబంధీకుడిని కోల్పోయానని విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతి విషయం తెలుసుకున్న వెంటనే బాలకిషన్ ఆసుపత్రికి వచ్చారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుని, అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి ఇంతకుముందే రెండు ఎకరాల భూమి ఉన్నందునా.. అతని తల్లికి ఎకరా పది గుంటల భూమిని ఇచ్చామని గుర్తుచేశారు.
ఉద్రిక్తతల నడుమ అంత్యక్రియలు:
ఉద్రిక్తతల నడుమే మహంకాళి శ్రీనివాస్ అంత్యక్రియలు నిర్వహించారు. యశోద నుంచి మృతదేహాన్ని శ్రీనివాస్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామానికి తరలించారు. అక్కడే అంత్యక్రియలు పూర్తయ్యాయి.
కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చాకే అంత్యక్రియలు నిర్వహించాలని బంధువులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ఆహార కమిటీ సభ్యుడు ఓరుగంటి ఆనంద్ వారితో మాట్లాడారు. రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆయన హామీనిచ్చారు. దీంతో శ్రీనివాస్ అంత్యక్రియలకు ఒప్పుకు న్నారు. శ్రీనివాస్కు భార్య శ్రావణి, కుమారులు మణిదీప్ (3), శశాంక్ (2) ఉన్నారు.
టీఆర్ఎస్ అన్యాయాలను భరించలేకే:
టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అన్యాయాలను భరించలేకే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్నికల సందర్భంలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు. మూడు లక్షల మందికి మూడెకరాల భూమి ఇస్తానన్న ప్రభుత్వం.. మూడేళ్ల పాలనలో 3వేల మందికి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.