ముంచుకొస్తున్న జిహెచ్ఎంసి ఎన్నికలు: దానంపై అధిష్టానం గుర్రు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్ వైఖరిపై ఆ పార్టీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నట్లు సమాచారం. పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తారో, లేదో తేల్చి చెప్పాలని దానం నాగేందర్కు పార్టీ నాయకత్వం అల్టిమేటం జారీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
గురువారం గాంధీభవన్లో జరిగే తెలంగాణ కాంగ్రెసు సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దానం నాగేందర్ వ్యవహారశైలిపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దానం నాగేందర్ తన వ్యవహార శైలిపై వివరణ ఇవ్వకపోతే పార్టీ పదవి నుంచి తప్పించే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుడు చురుగ్గా లేకపోతే ఎలాగనే సందిగ్ధంలో కాంగ్రెసు నాయకత్వం ఆలోచన పడినట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాల పట్ల ఆయన చాలా కాలంగా అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. వరంగల్ ఉప ఎన్నికలో ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పరువు కాపాడుకోవాలనే ఆలోచనలో నాయకత్వం ఉంది.

ఇటువంటి కీలకమైన సమయంలో దానం నాగేందర్ వ్యవహార శైలి పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా పరిణమిమంచినట్లు చెబుతున్నారు. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా చురుకైన నాయకుడిని నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి తనను ఎవరూ ఆహ్వానించలేదని దానం నాగేందర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించనున్నారనే వార్తలపై దానం నాగేందర్ ఘాటుగా స్పందించారు.
తనను తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. వచ్చి కలవాలని మాత్రమే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు చెప్పారని చెప్పారు.












Click it and Unblock the Notifications