మలుపులు: 'టెక్కీ మధుకర్ భార్య స్వాతికి ప్రాణభయం, రూ.70 లక్షల రగడ.. వారి వల్లే'
అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్టువేర్ ఇంజినీర్ మధుకర్ ఆత్మహత్య అంశం మలుపులు తిరుగుతోంది.
హైదరాబాద్: అమెరికాలో ఆత్మహత్య చేసుకున్న సాఫ్టువేర్ ఇంజినీర్ మధుకర్ ఆత్మహత్య అంశం మలుపులు తిరుగుతోంది. తమపై వేలాది ముందు దాడి చేశారని, కాబట్టి తమకు రక్షణ కావాలని, ఈ మేరకు పోలీసులను కలుస్తామని మధుకర్ భార్య స్వాతి, స్వాతి తల్లి చెబుతున్నారు.
కొట్టేవాడు, ఆ తర్వాత సారీ, మారతానన్నాడు, కానీ: టెక్కీ మధుకర్ ఆత్మహత్యపై భార్య స్వాతి
డిప్రెషన్తోనే.. స్వాతి తల్లి
మధుకర్ డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని తాము అనుకుంటున్నామని స్వాతి తల్లి చెబుతున్నారు. ఆస్తులు తాము తీసుకుంటామని భావించే తన కూతురుపై ఆరోపణలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
మా ఆలోచన ఆస్తి గురించి కాదు..
తన కూతురుకు పాప ఉందని, కాబట్టి ఆస్తి అడుగుతారని భావించే, అలా అడగకుండా ఉండేందుకు, బెదిరించే ఉద్దేశ్యంలో భాగంగనే తమపై దాడి చేసి ఉంటారని స్వాతి తల్లి అన్నారు. తాము ఇప్పటి వరకు వాళ్ల ఆస్తి గురించి ఆలోచించలేదన్నారు. తమకు దాని గురించి ఆలోచనే లేదన్నారు.
చిన్న పాప (స్వాతి కూతురు) డాడీ కావాలని అడుగుతోందని, ఇప్పటి దాకా తాము ఆమె గురించే అలోచించామని స్వాతి తల్లి అన్నారు. వాళ్ల ఆస్తి గురించి మాత్రం ఆలోచించలేదన్నారు. నిన్న దాడి ఘటన చూసి ఆ చిన్న పాప భయపడిపోయిందన్నారు. మనం వెళ్లిపోదామని అంటోందన్నారు.
ఎందుకు దాడి చేశారో.. సెక్యూరిటీ కావాలి
ఈ గొడవలో రవీందర్ రెడ్డి తమపై ఎందుకు దాడి చేశారో అర్థం కావడం లేదన్నారు. మా మీద ఏమైనా కక్ష ఉంటే కూర్చుండ బెట్టి మాట్లాడవచ్చునని చెప్పారు. ఈ రోజు వేలమందిలో తమపై దాడి చేశారని, దీంతో తమకు చాలా భయం ఉందన్నారు. తమకు సెక్యూరిటీ కావాలని కోరుకుంటున్నామన్నారు.
మా కూతురు, మా భర్త, తనపై దాడి చేశారని, తమకు ప్రాణ భయం ఉందన్నారు. మేం ఆస్తి కోసం కొట్లాడుతామని వారు అనుకుంటున్నారేమోనని, కానీ తమకు ఆస్తి గురించి గొడవ లేదన్నారు. తన కూతురు, మనవరాలు ఇంటి నుంచి బయటకు వెళ్లినా ఎక్కడ దాడి చేస్తారోననే భయం ఉందన్నారు. సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను కలుస్తామన్నారు.
రీపోస్టుమార్టం చేయండి
తన భర్త మధుకర్ రెడ్డి మృతిపై విచారణ చేపట్టాలని, అవసరమైతే రీపోస్టుమార్టం చేపట్టాలని స్వాతి డిమాండ్ చేస్తున్నారు. తన భర్త ఆత్మహత్య చేసుకుంటాడని అనుకోలేదని, దీని వల్ల తానే నష్టపోయానని, అయినా తనపై దాడి దారుణం అన్నారు. తనకు ప్రాణ భయం ఉందని, రక్షణ కావాలన్నారు.
పెదనాన్న కొడుకు రవీందర్, రాధిక..
మధుకర్ రెడ్డి తల్లిదండ్రులు తమతో బాగానే ఉన్నారని, కానీ రవిందర్ అనే వ్యక్తి (మధుకర్ పెదనాన్న కొడుకుగా చెప్పే వ్యక్తి), అతనితో పాటు రాధిక అనే వాళ్లు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. తాను అమెరికాలో ఉండగా రవీందర్ ఫోన్ ద్వారా వేధించారన్నారు. తన భర్త చనిపోయిన దుఖంలో ఉంటే వేధింపులు ఏమిటన్నారు. మధుకర్ తల్లిదండ్రులు మాత్రం ఏమీ అనడం లేదన్నారు. మధ్యవర్తులే ఆరోపిస్తున్నారన్నారు.
ప్రాపర్టీ... రూ.70 లక్షల వివాదం
భార్య స్వాతి వల్లే చనిపోయాడని మధుకర్ బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, బంధువులకు తన భర్త మధుకర్ రూ.70 లక్షల అప్పులు ఇచ్చాడని, అలాగే ఆయన డిప్రెషన్లో ఉన్నాడని, ఈ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని స్వాతి చెబుతున్నారు.
మధుకర్ దాదాపు రూ.70 లక్షల వరకు తన బంధువులకు అప్పుగా ఇచ్చారని చెప్పారు. ఉద్యోగంతో పాటు ఈ ఒత్తిడి కూడా ఉందన్నారు. దీంతో అతను కృంగిపోయాడన్నారు. మధు తన అన్నకు రూ.40 లక్షలు, అక్కకు రూ.30 లక్షలు ఇచ్చాడని చెప్పారు. ఆర్థిక సమస్యలు వేధించాయన్నారు.