ఓడిపోయాం, మా పైసలు మాకివ్వండి : తెలంగాణలో కొత్త ' పంచాయితీ '

తెలంగాణ 'పంచాయతీ' ఎన్నికల వేళ కొత్త 'పంచాయితీ' తెరమీదకొచ్చింది. గ్రామపోరులో నిలిచి ఓడిపోయిన అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు చర్చానీయాంశంగా మారింది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా పోటీకి దిగి ఓడిపోవడంతో.. తాము పంచిన డబ్బులు వసూలు చేసుకుంటుండటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎన్నికలంటే గెలుపోటములు సహజం. కానీ ఎన్నడూలేని విధంగా ఈసారి ఓడిపోయిన అభ్యర్థులు.. తాము ఓటర్లకు పంచిన డబ్బులు తిరిగి వసూలు చేసుకోవడానికి సిద్ధం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పైసలు తీసుకున్నావు, ఓటెయ్యలే..!

పైసలు తీసుకున్నావు, ఓటెయ్యలే..!

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ఏరులై పారుతోంది. ఇప్పటివరకు జరిగిన రెండు విడతల్లో పోటీ చేసిన అభ్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టారు. ఎన్నికలకు వెళితే గెలిస్తామో లేదో తెలియని పరిస్థితుల్లో చాలాచోట్ల ఏకగ్రీవానికి సై అన్నారు. ఆ మేరకు ఖర్చు ఎంతైనా వెనుకాడలేదు. అయితే ఎన్నికలు జరిగి ఓడిపోయిన వాళ్ల బాధ మాత్రం వర్ణనాతీతం. లక్షలు ఖర్చు పెట్టిన కూడా విజయం వరించకపోవడంతో తట్టుకోలేకపోతున్నారు. ఆ క్రమంలో ఓటర్లకు పంచిన డబ్బులు, చీరలు, గృహెపకరణాలు, ఇతర వస్తువులు తిరిగి తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. తమకే ఓట్లేస్తామని మాట ఇచ్చి డబ్బులు తీసుకుని చివరకు ఓడిస్తారా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఒకచోట సర్పంచ్ గా బరిలోకి దిగినతను గెలుపే లక్ష్యంగా కేవలం ఓట్ల కోసం 2 -3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆయా కులసంఘాలకు లక్ష రూపాయల వరకు ఇవ్వగా, ఓటర్లకు మరో లక్ష పంచినట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో ఓడిపోవడంతో తాను ఎవరికైతే డబ్బులు ఇచ్చాడో వాళ్ల ఇంటిచుట్టూ తిరుగుతున్నారట. కులసంఘాల పెద్దలు మాత్రం ఆయన డబ్బులు తిరిగి ఇస్తామని మాట ఇచ్చినప్పటికీ.. ఓటర్లు మాత్రం తిరగబడుతున్నారట.

నా పైసలు నాకియ్యు

నా పైసలు నాకియ్యు


సూర్యాపేట జిల్లాలో జరిగిన ఇలాంటి ఘటన వాట్సాప్ లో తెగ వైరల్ అవుతోంది. అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడేంకు చెందిన ఒకతను.. తన భార్యను వార్డుమెంబర్ గా పోటీ చేయించారు. దాదాపు 250 వరకు ఓట్లున్న ఆ వార్డులో ఓటుకింత అని డబ్బులు పంచారు. తీరా ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో.. తాను డబ్బులిచ్చినోళ్ల దగ్గరికి వెళ్లి రిటర్న్ ఇవ్వాలని అడుగుతున్నారు. అయితే కొందరు ఏమనలేకపోతున్నా.. మరికొందరు మాత్రం ఎందుకివ్వాలంటూ ప్రశ్నిస్తున్నారట.

 ఓడినోళ్ల గాథ.. అయ్యో రొంపిలోకి దిగామే..!

ఓడినోళ్ల గాథ.. అయ్యో రొంపిలోకి దిగామే..!

పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల తర్వాత, వాట్సాప్ లో వైరల్ గా మారిన ఓ వీడియో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సర్పంచ్ గా ఎన్నిక కావడానికి ఒక్కో ఓటుకు 5వేల రూపాయలు ఇచ్చామని, అయినా గెలిపించలేదని ఓ కుటుంబం బోరున విలపించిన ఘటన జనాల్లో ఆలోచన రేకెత్తించింది. కనీసం 100 మందికి వాళ్లు డబ్బులు పంచినా.. 5 లక్షల రూపాయలు అవుతాయి. అదే 200 మందికి పంచితే 10 లక్షల రూపాయలు అవుతాయి. గ్రామాభివృద్ధి కోసం ఎన్నుకొనే వారిని ఇలా డబ్బులకు అమ్ముడుపోయి కొనుక్కుంటే.. భవిష్యత్తులో వారు పనులు చేయగలరా అనే వాదనలు తెరపైకి వచ్చాయి.

చాలాచోట్ల సర్పంచ్ గా గెలవాలనే తాపత్రయంతో డబ్బులు లేకున్నా బరిలో నిలిచారు. అక్కడ ఇక్కడ అందినకాడికి అప్పులు చేసి మరీ పోటీ చేశారు. తీరా ఓడిపోవడంతో అప్పులు ఇచ్చినవాళ్ల ఒత్తిడి పెరుగుతోంది. అనవసరంగా పోటీకి దిగామంటూ తలలు పట్టుకుంటున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+