పార్టీ మారలేదంటున్న ఎమ్మెల్యేలు: స్పీకర్ నోటీసులపై రేవంత్ వ్యూహం!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అనర్హత నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ కీలక సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో స్పీకర్ నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలి, తదుపరి న్యాయపరమైన మరియు రాజకీయ వ్యూహాలు ఏమిటనే దానిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డి. శ్రీధర్ బాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
ఈ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్లైన్ విధించడం.. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపులపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం.. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ పార్టీ ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ కీలక సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులకు అనుమతులు, నిధులు, పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం.. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ నోటీసుల విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలని అనే దాని చర్చ జరిగిందని టాక్ వినిపిస్తోంది.

కడియం శ్రీహరి మినహా అందరూ హాజరు
స్పీకర్ నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మినహా మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మహీపాల్రెడ్డి, ప్రకాశ్గౌడ్, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే స్పీకర్కు తమ వివరణ ఇచ్చారు, మరికొందరు ఇంకా స్పందించలేదు. భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలకు కూడా వెంటనే స్పందించాలని సూచించినట్లు సమాచారం. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, పెండింగులో ఉన్న బిల్లులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే సభాపతి ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలనే అంశంపై న్యాయనిపుణులతో చర్చ తర్వాత.. తాము పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నామని.. నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసామని నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. అన్ని విషయాల్లో అండగా ఉంటానని.. పార్టీని, తనను నమ్మి వచ్చిన వారిని కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకాడబోమని హామీ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని సూచించినట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాలు
బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, 90 రోజుల్లోగా ఈ అంశంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న జోగులాంబ గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నానని, పార్టీ మారలేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. స్పీకర్ నోటీసులపై ఎమ్మెల్యేలు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి తగు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించింది.












Click it and Unblock the Notifications