తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా: భారీగా పెరుగుతున్న కరోనా కేసులే కారణం
హైదరాబాద్: కరోనా ఉధృతి నేపథ్యంలో తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న దృష్ట్యా అన్ని యూనివర్సిటీల పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేకు అన్ని విశ్వవిద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత పరీక్షలను రీషెడ్యూల్ చేస్తామని పాపిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఆయా యూనివర్సిటీలు మంగళవారం ప్రకటించాయి. ఈ క్రమంలో సమీక్ష నిర్వహించిన ఉన్నత విద్యామండలి.. సెమిష్టర్ పరీక్షలను వాయిదా వేయాలని యూనివర్సిటీలకు సూచించింది. సినీ పరిశ్రమలోని కార్మికులను దృష్టిలో పెట్టుకుని సినిమా థియేటర్లను మూసివేయడం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం రాత్రి 8 గంటల వరకు 70,280 కరోనా పరీక్షలు నిర్వహంచగా.. 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,04,298కి చేరింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1676కి చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి కొత్తగా 228 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి బయటపడినవారి సంఖ్య 2,99,270కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,352కు చేరింది. వీరిలో 1395 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 97,89,113 కరోనా పరీక్షలను నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7,86,426 మందికి ఒకటో డోసు , 2,24,374 మందికి రెండో డోసు వేసినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ తెలిపింది.