ఢిల్లీ లిక్కర్ స్కామ్: హైదరాబాద్ నుండి ధనప్రవాహం; తీగలాగితే కదిలిన డొంక; త్వరలోనే అరెస్టులు!!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ హైదరాబాద్లో ప్రకంపనలు రేకెత్తించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం ముడుపుల కేసులో హైదరాబాద్ లో వరుస తనిఖీలు నిర్వహిస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో అనుమానితుల ఇళ్ళు, కార్యాలయాలలో తనిఖీలలో భాగంగా పలు కీలక ఆధారాలను సేకరించిన ఈడి దాడులను మరింత ముమ్మరం చేసింది. త్వరలో ఈ కేసులో అరెస్టులు ఉంటాయన్న చర్చ జరుగుతుంది.
రామచంద్ర పిళ్ళై ఇళ్ళు, సంస్థలలో మొదలైన తనిఖీలు .. కీలక ఆధారాలు
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి జరిగిన ముడుపుల వ్యవహారంలో తెలుగు రాష్ట్రాల మూలాలు ఉన్నాయని ఈడీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై దాడులకు దిగింది. ముఖ్యంగా హైదరాబాద్లో రాబిన్ డిస్టిలరీ వ్యాపారి రామచంద్ర పిళ్ళైను ఈ వ్యవహారంలో నిందితుడిగా పేర్కొన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అభియోగం ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసింది.
రామచంద్ర పిళ్ళై ఇళ్ళు, రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలలో తనిఖీలను నిర్వహించింది. రాబిన్ సంస్థలలో ఆర్థిక మూలాలు, వాటిలో ఉన్న భాగస్వాములు ఎవరు అన్న అంశంపై దృష్టి సారించిన ఈడీ అధికారులు ఢిల్లీ కాంట్రాక్టు దక్కించుకున్న ఈ సంస్థల్లోకి నిధుల ప్రవాహం ఎలా జరిగిందన్న దానిపై దృష్టి సారించారు.
రాబిన్ సంస్థలో భాగస్వాములుగా అభిషేక్, ప్రేమ్ సాగర్
రాబిన్ డిస్టిలరీ సంస్థకు ఏ సంస్థలతో సంబంధం ఉందన్న దానిపై దర్యాప్తు జరిపారు. హైదరాబాద్ కు చెందిన అభిషేక్ బోయినపల్లి, ప్రేమ సాగర్ గండ్ర రాబిన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ లో వీరు కూడా సహ డైరెక్టర్లు గా ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో వీరు ఇంకా ఏ సంస్థలలో భాగస్వామిగా ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేసిన ఈడీ అధికారులు అభిషేక్ బోయినపల్లి మరో తొమ్మిది సంస్థలలో డైరెక్ట్ గా ఉన్నట్టు గుర్తించారు.
వీటిలో కొన్ని సంస్థలకు గోరంట్ల అసోసియేటెడ్స్ సంస్థ ఆడిటింగ్ నిర్వహించినట్టు బయటపడడంతో, గోరంట్ల అసోసియేట్స్ సంస్థ నిర్వాహకుడు గోరంట్ల బుచ్చి బాబు ఇంటిపై, ఆయన కార్యాలయంపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
కరీంనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాలలో సోదాలు
ఇక్కడ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులకు కీలక సమాచారం లభించిందని తెలుస్తుంది. దీని ఆధారంగా మళ్లీ తనిఖీలు ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈసారి కరీంనగర్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాస్ ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించారు. శ్రీనివాసరావు రాబిన్ డిస్టిలరీస్ డైరెక్టర్ గా ఉన్న గండ్ర ప్రేమ్ సాగర్ కు సమీప బంధువు కావడంతో ఈడీ అధికారులు ఆయనను ఏడు గంటల పాటు ప్రశ్నించారు.
ఇక వెన్నమనేని శ్రీనివాస్ ఇంట్లో నిర్వహించిన తనిఖీలలో పెద్ద ఎత్తున జరిగిన డబ్బు లావాదేవీలను గురించి ఆయనను ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో రెండు సాఫ్ట్ వేర్ సంస్థలలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాబిన్ సంస్థల్లోకి ప్రవహించిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక మూలాలు ఈడీ అధికారులు ఈ సోదాలలో గుర్తించినట్టు తెలుస్తోంది. డబ్బు హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు ఏవిధంగా ప్రవహించింది అన్నదానిపై ఈడీ అధికారులు ఒక క్లారిటీ కి వచ్చారు.
బ్లాక్ మనీని వైట్ మనీగా .. అనుమానంతో సాఫ్ట్ వేర్ కంపెనీలలో సోదాలు
ఇదిలా ఉంటే రెండు సాఫ్ట్ వేర్ సంస్థలో నిర్వహించిన తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తున్నాయి. మద్యం ముడుపుల కు, సాఫ్ట్ వేర్ సంస్థలకు సంబంధం ఏమిటి అన్న విషయానికి వస్తే, ఈ సాఫ్ట్ వేర్ సంస్థలు పెద్దగా కార్యకలాపాలు నిర్వహించినప్పటికీ, ఇతర వ్యాపారాల ద్వారా సంపాదించిన డబ్బును ఈ సంస్థలకు మళ్లించి వాటి ఆదాయంగా చూపించారని, ఖచ్చితంగా చెప్పాలంటే బ్లాక్ మనీని వైట్ మనీ గా చూపించడానికి ఈ సంస్థలను ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు దానిని నిర్ధారించుకోవడం కోసమే రెండు సాఫ్ట్ వేర్ సంస్థలలోనూ సోదాలు జరిపినట్లుగా తెలుస్తోంది.
మద్యం ముడుపుల వ్యవహారంలో నిందితులుగా ఉన్న వారికీ, ఈ సాఫ్ట్ వేర్ సంస్థలకు లింకు ఉండడంతో వీటిపై కూడా ఈడీ అధికారులు దాడులు చేసినట్లు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో త్వరలో అరెస్టులు
ఇక ఇప్పటికే మద్యం ముడుపుల కుంభకోణంలో పలువురికి 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కనీసం ఈ కేసులో హైదరాబాద్ నుండి ఇద్దరిని అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దర్యాప్తు తుది దశకు చేరుకోవడంతో ఈ కేసులో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ప్రముఖులకు కూడా నోటీసులు జారీ చేసి ఢిల్లీలో విచారించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఢిల్లీ మద్యం కుంభకోణం హైదరాబాద్ లో ప్రకంపనలు సృష్టించి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని హైదరాబాద్ పై ఫోకస్ అయ్యేలా చేసింది.