మునుగోడులో షేర్ మార్కెట్ కంటే వేగంగా ఫిరాయింపులు!జోడో యాత్రను విమర్శించే స్ధాయి కేటీఆర్ కు లేదన్న కాంగ్రెస్!
మునుగోడు/హైదరాబాద్: షేర్ మార్కెట్ కంటే వేగంగా మునుగోడులో పార్టీ పిరాయింపులు జరుగుతున్నాయన్నారు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందని పిలుపునిచ్చారు. ఫిరాయింపు రాజకీయాలను పాతరేయాలంటే అది యూత్ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు పీసిసి ఛీఫ్. కాంగ్రెస్ పార్టీని చంపాలనే టీఆరెస్, బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ పై ఉందన్నారు తెలంగాణ టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి.
మునుగోడు గడ్డపై కాంగ్రెస్ పార్టీని గెలిపంచుకోవాలి
రాజకీయ పార్టీలు మునుగోడులో ప్రచారలను ఉదృతం చేస్తున్నాయి. అధికార బీఆర్ఎస్, బీజేపీ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో దూసుకెళ్తోంది. మునుగోడు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కార్యక్రమాలకు మంచి స్పందన ఉండేదని, తెలంగాణలో సమస్యలపై పోరాడేందుకు యూత్ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి.
బడుగు బలహీన వర్గాల వేదిక కాంగ్రెస్..
బడుగు బలహీన వర్గాలకు వేదిక కాంగ్రెస్ అని, ఈ వేదికను లేకుండా చేసేందుకు కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకోవాలని బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు చూస్తున్నాయన్నారు. దళిత, బహుజనులు ఎవరైనా టీఆరెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా?అని ప్రశ్నించారు. కలలో కూడా చంద్రశేఖర్ రావు అలాంటి ఆలోచన రానివ్వడని రేవంత్ రెడ్డి మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశంలో, రాష్ట్రంలో పేదలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలన్నారు పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి.
జోడో యాత్రపై స్పందించే స్థాయి కేటీఆర్ కు లేదు..
రాహుల్ గాందీ జోడో యాత్రపై కామెంట్ చేసే స్థాయి మంత్రి కేటీఆర్ కు లేదన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేటీఆర్ కు, టీఆర్ఎస్ నేతలకు పదవులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పెట్టిన భిక్ష అని అన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోందన్నారు మహేశ్వర్ రెడ్డి. రాహుల్ గాంధీ పాదయాత్ర భరత్ దేశ రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఈ నెల 24న తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నుంచి రంగా రెడ్డి జిల్లా శంషాబాద్, షాద్ నగర్, జోగిపేట, మద్నూర్ మీదుగా మహారాష్ట్ర లోకి ఎంట్రీ అవుతుందన్నారు మహేశ్వర్ రెడ్డి.
దేశ ప్రజలను కదిలిస్తున్న రాహుల్ యాత్ర..
తెలంగాణలో 13 నుంచి 15 రోజుల పాటు, 330 నుంచి 350 కిలో మీటర్ల వరకు యాత్ర కొనసాగుతుందన్నారు మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో రాహుల్ యాత్రకు భారీ స్పందన వస్తుందని, ప్రజలంతా రాహుల్ రాక కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్కం ఠాగూర్ తెలంగాణలో జోడో యాత్ర పై గురువారం గాంధీ భవన్ లో రివ్యూ చేసి, యాత్ర, ఏర్పాట్లు, రూట్ మ్యాప్ మార్పులు, చేర్పులపై చర్చిస్తారన్నారు మహేశ్వర్ రెడ్డి.