నాగుల పంచమి రోజున... బాసర సరస్వతి ఆలయంలో కొండ చిలువ కలకలం...
నిర్మల్ జిల్లా బాసరలో ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయంలో శనివారం(జూలై 25) కొండచిలువ కలకలం సృష్టించింది. ఆలయంలో గల అక్షరాభ్యాస మంటపం ప్రధాన ద్వారం వద్ద పాము కనిపించడంతో కొంతమంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఇవాళ శ్రావణ మొదటి శనివారం,నాగుల పంచమి కావడంతో ఆలయంలోకి పాము రాకను శుభ సూచకమని పండితులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు కొండ చిలువకు పాలు పోసి పూజలు చేసినట్లు సమాచారం. అయితే ఆలయ సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.... అధికారులు పామును బంధించి అక్కడినుంచి తీసుకెళ్లారు.
ఆదిలాబాద్ జిల్లాలోనూ నాగుల పంచమి రోజున ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. అర్లిబి గ్రామంలోని ఓ చెక్ డ్యామ్ వద్ద రెండు నాగుపాములు సయ్యాటలాడుతూ కనిపించాయి. స్థానికులు వాటిని సెల్ఫోన్లో చిత్రీకరించడంతో... అది కాస్త వైరల్గా మారింది. నాగుపాముల సయ్యాట గురించి తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని తిలకించారు. నాగుల పంచమి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ప్రతీ ఏటా ఆదిలాబాద్లోని కేస్లాపూర్లో ఉన్న నాగోబా ఆలయంలో నాగుల పంచమిని ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వేడుకలను రద్దు చేస్తూ మెస్రం వంశీయులు నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video
కాగా,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్లలో నాగుల పంచమిని చాలామంది భక్తిశ్రద్దలతో జరుపుకుంటున్నారు.ఉదయం నుంచే చాలా ఆలయాల్లో భక్తుల పూజలు మొదలయ్యాయి. నాగ దేవతకు ప్రత్యేక పూజలు చేసి,పుట్టలో పాలు పోస్తున్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని కొంతమంది భక్తులు పూజలు చేయడం గమనార్హం.