దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: తీర్పు 13కు వాయిదా
హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు తీర్పును ఎన్ఐఏ న్యాయస్థానం డిసెంబర్ 13కు వాయిదా వేసింది. ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది.
ఈ పేలుళ్లలో ఐఎం సభ్యులు రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ షేక్ ప్రమేయమున్నట్లు దర్యాప్తు సంస్థ తేల్చింది. రియాజ్ భత్కల్ పరారీలో ఉండగా.. మిగిలిన వారంతా చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.
సుమారు మూడున్నరేళ్ల పాటు సాగిన విచారణ ప్రక్రియలో 157 మంది సాక్షుల వాంగ్మూలాను న్యాయస్థానం నమోదు చేసింది. 502 దస్త్రాలు, 201 వస్తువులను ఆధారాలుగా పరిశీలించారు. తుది తీర్పు నేపథ్యంలో నిందితులను పోలీసులు సోమవారం ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచారు. అయితే తీర్పును డిసెంబర్ 13కు వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది.
2013, ఫిబ్రవరి 21న సాయంత్రం జరిగిన జంట పేలుళ్లలో 19 మంది మరణించగా.. 131 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఆరుగురు నిందితులపై ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ అభియోగపత్రాలను దాఖలు చేసింది.