దిశ అత్యాచారం,హత్యకేసు ... నిందితులకు 10 రోజుల పోలీసు కస్టడీ విధించిన కోర్టు
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే సంచలనంగా మారిన దిశ అత్యాచారం, హత్యకేసు ఘటనలో నలుగురు నిందితుల కస్టడీ కోరుతూ షాద్ నగర్ పోలీసులు, షాద్ నగర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో మరింత నిశితంగా విచారణ చేపట్టాల్సి ఉందని, నిందితులను మరింత విచారణ చెయ్యాలని పిటీషన్ లో పేర్కొన్న పోలీసులు , నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఇక దిశ అత్యాచారం, హత్యకేసులో నిందితులను పోలీసుల కస్టడీకి అప్పగించింది కోర్టు.
దిశ ఘటనతో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం .. అమలులోకి జీరో ఎఫ్ఐఆర్
ఇంకా విచారణ జరపాల్సి ఉందన్న పోలీసుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించింది షాద్ నగర్ కోర్టు. నిందితులకు 10 రోజుల కస్టడీని విధించింది. దిశ హత్యకేసుకు సంబంధించిన విచారణలో భాగంగా నిందితుల దగ్గర నుంచి మరింత సమాచారం తెలుసు కోవాల్సి ఉందని కోర్టుకు తెలిపారు పోలీసులు. దిశ కేసులో నిందితులను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించే రోజు కూడా వేలాది మంది పోలీస్ స్టేషనుకు చేరుకోవడంతో తాము నిందితుల నుంచి సమగ్ర సమాచారం తీసుకోలేదని తెలిపారు. అందువల్ల నిందితులను పది రోజులు కస్టడీకి అనుమతి ఇస్తే వారిని మరింత లోతుగా విచారిస్తామని చెప్పారు పోలీసులు.
ఇక అంతే కాకుండా ఘటనలో మిస్సయిన మొబైల్ ఫోన్ రికవరీ చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. అదే విధంగా నిందితుల స్టేట్మెంట్ రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్లో వెల్లడించారు.ఇక దిశ హత్యాచారం కేసులో విచారణ ఖైదీలుగా చర్లపల్లి జైలులో ఉన్న నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, శివ, నవీన్ చెన్నకేశవులుకు సింగిల్ సెల్లో ఉంచి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వారి ఆరోగ్య పరిస్థితులను జైలు వైద్యులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇక వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా అన్న కోణంలో కూడా వారిని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక పోలీసులు కోర్టు అనుమతితో వారిని 10 రోజుల పాటు కస్టడీకి తీసుకోనున్నారు .