దళితబందుపై అసంతృప్తి.!నష్టనివారణ చర్యల్లో భాగమే నామినేటెడ్ పోస్టులు.!సీఎం వైఖరిపై దళితుల్లో చర్చ.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేసిన దళిత బందు పథకంపై దళిత సామాజిక వర్గంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికముందు దళిత బందు పథకంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత దళిత బంధు ప్రథకం అమలువుతుందా.?కాదా.?అనే సందేహాలు తెలంగాణ దళితజాతిని తొలుస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశం పట్ల సీఎం చంద్రశేఖర్ రావుపై దళిత ప్రజానీకం ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో దళితుల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, పార్టీకి జరుగుతున్న నష్టన్ని నివారించుకోవడానికి నామినేషన్ పదవులను దళితులకు కట్టబెట్టారనే చర్చ దళితుల్లో పెద్దఎత్తున జరుగుతున్నట్టు తెలుస్తోంది.
దళితుల కోపాలన్ని చల్లార్చాలి..
తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు కొన్ని పథకాలను హంగు ఆర్బాలతో ప్రకటించి ఆతర్వాత వాటి ఊసెత్తరనే అపోహలు తెలంగాణ సమాజంలో నెలకొన్నాయి. గతంలో ప్రకటించిన నిరుద్యోగ భృతి, మూడెకరాల భూమి, జర్నలిస్టులకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం వంటి అనేక వాగ్ధానాలకు గ్యారెంటీ లేదనే చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ప్రకటించి, పైలట్ ప్రాజెక్టు కూడా హుజురాబాద్ నుండే ప్రారంభించారు. ఐతే ఎన్నికల కోడ్ వల్ల అప్పట్లో దళితబంధు పథకం తాత్కాలికండా నిలిపేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఎకౌంట్లు ఫ్రీజ్ అయినట్టే పథకం కూడా ఫ్రీజ్ అవుతుందా?
దళితుల దళితబంధు ఎకౌంట్లు ఫ్రీజ్ అయినట్టే ఈ పథకం కూడా ఫ్రీజ్ అయ్యిందా అనే సందేహాలు తెలంగాణ దళితులలోకంలో చెలరేగుతున్నాయి. గతంలో ప్రకటించి, అమలుకు నోచుకోని పథకాల మాదిరిగానే దళితబంధు కూడా ఆచరణకు యోగ్యం కాదనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు దళితులు. అలాంటప్పుడు దళితబంధు అనే పథకాన్ని ఎందుకు ప్రకటించారని, దళితుల్లో ఎందుకు ఆశలు రేపారని మండిపడుతున్నారు దళితులు. హుజురాబాద్ ఉప ఎన్నికకోసమై ఐతే రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ పథకం వర్తిస్తుందని ఎందుకు ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు దళితులు.
నష్ట నివారణ చర్యల్లో భాగమే..
రాష్ట్ర దళిత ప్రాజానీకంలో చెలరేగిన ఆగ్రహ జ్వాలలను చల్లార్చేందుకు సీఎం చంద్రశేఖర్ రావు మరో బృహత్కర ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. దళితబంధు పథకం అమలవుతుందా.? కాదా అనే అంశం పక్కన పెడితే దళితుల్లో నెలకొన్న ఆగ్రహాన్ని చల్లార్చి మచ్చికచేసుకోవాలనే ప్రణాళిక రచించినట్టు తెలుస్తోంది. దళితబంధు పథకం అమలు గురించి పెద్ద ఎత్తున చర్చ అవసరం లేదని కలెక్టర్లు ఆ పని చూసుకుంటారని కొద్ది రోజుల క్రితం చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఐతే ఆ విషయం మరుగున పడేందుకు మరో అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు సీఎం చంద్రశేఖర్ రావు.
కేసీఆర్ పాచిక పారుతుందా.?
మునుపెన్నడూ లేని విధంగా దళిత సామాజిక వర్గ నేతల పట్ల ఆదరణ చూపించారు చంద్రశేఖర్ రావు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులను దళితులకు కట్టబెట్టారు చంద్రశేఖర్ రావు. మూడు కార్పొరేషన్ పదవుల నియామకాల్లో ముగ్గురు దళితులను ఎంపిక చేసారు చంద్రశేఖర్ రావు. దళిత సామాజిక వర్గానికి చెందిన మన్నె క్రిశాంక్ కు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు.
ఎర్రోళ్ల శ్రీనివాస్ ను తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్గా, వేద సాయిచందర్ ను తెలంగాణ స్టేట్ వేర్ హౌజింగ్ కార్పోరేషన్ చైర్మన్ గా సీఎం చంద్రశేఖర్ రావు నియమించారు. దళితబంధు వల్ల చెలరేగిన అసంతృప్తిని ఈ మూడు నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి చంద్రశేఖర్ రావు నిష్టనివారణ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో చూడలి.